
నాడు–నేడులో 1,117 బడుల అభివృద్ధి
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలో మొదటి విడతలో 1,117 పాఠశాలలను రూ.280.44 కోట్లతో అభివృద్ధి చేశారు. అదనపు తరగతి గదులు నిర్మించడం, శ్లాబులు, గోడల మరమ్మతులు, ప్రహరీ గోడల నిర్మాణం, మరుగుదొడ్ల సౌకర్యం, పరిశుభ్రమైన తాగునీటి సరఫరా, తగరతి గదుల్లో గ్రీన్ చాక్బోర్డుల ఏర్పాటు, చక్కటి వెలుగుల కోసం ట్యూబ్లైట్లు, చల్లని గాలి కోసం ఫ్యాన్లు, తరగతి గదుల్లో రంగులతో గోడలకు పెయింటింగ్, క్రీడా ప్రాంగణాల అభివృద్ధి, ప్రహరీ గోడలపై విజ్ఞానాన్ని పెంచేలా, విద్యార్థుల్లో ఆసక్తిని రేకెత్తించేలా చూడచక్కని బొమ్మలు వేయించారు. రెండో విడతలో ఏలూరు జిల్లాలో 889 పాఠశాలలను ఎంపిక చేసి వాటి అభివృద్ధికి రూ.295.54 కోట్లు మంజూరు చేశారు. అలాగే పశ్చిమగోదావరి జిల్లాలో 739 పాఠశాలలను ఎంపిక చేసి వాటి అభివద్ధికి రూ.259.19 కోట్లు కేటాయించారు.