
హోరాహోరీగా హాకీ పోటీలు
భీమవరం: భీమవరం డీఎన్నార్ కళాశాల ఆవరణలో 15వ అంతర్జిల్లాల రాష్ట్ర స్థాయి బాలికల హాకీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 16 టీంలు పాల్గొంటున్నాయి. శనివారం నిర్వహించిన పోటీల్లో 13 జట్లు పాల్గొన్నాయి. వీటిలో కడప– ఎన్టీఆర్ జిల్లాల జట్ల మధ్య పోటీలో కడప 12 గోల్స్ చేసి విజయం సాధించింది. గుంటూరుపై అనంతపురం, కృష్ణాపై ప్రకాశం, పశ్చిమగోదావరిపై అనకాపల్లి జట్టు విజయం సాధించింది. శ్రీసత్యసాయి– నెల్లూరు మధ్య జరిగిన పోటీలో శ్రీసత్యసాయి జట్టు, తిరుపతి–నంద్యాల మధ్య పోటీలో తిరుపతి, విశాఖపట్నం–మన్యం జిల్లా మధ్య పోటీలో విశాఖపట్నం విజయం సాధించాయి. కాకినాడ–అన్నమయ్య జిల్లాల మధ్య పోటీలో ఎవరూ గోల్ చేయకపోవడంతో డ్రాగా ముగిసింది. 288 మంది క్రీడాకారులకు డీఎన్నార్ కళాశాల యాజమాన్యం వసతి కల్పించగా జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భోజనం ఇతర సౌకర్యాలు కల్పించినట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కలిదిండి ఆనందరాజు, కేవీఎస్ భరత్ చెప్పారు.