పంట మార్పిడితో అధిక దిగుబడి | - | Sakshi
Sakshi News home page

పంట మార్పిడితో అధిక దిగుబడి

Jun 8 2025 12:54 AM | Updated on Jun 8 2025 12:54 AM

పంట మ

పంట మార్పిడితో అధిక దిగుబడి

బుట్టాయగూడెం : ఒకే పొలంలో ఒకే పంట సాగు ద్వారా దిగుబడులు తగ్గుతాయి. పంటల్లో ఎదుగుదల ఉండదు. చీడపీడల ఉధృతి అధికంగా ఉంటుంది. పంటల మార్పిడి ద్వారా భూసారం పెరుగుతుందని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఒకే పొలంలో వేర్వేరు పంటలను ఒక క్రమంలో సాగు చేస్తే అధిక ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు. పంట మార్పిడితో ప్రకృతి వనరులు సమర్ధవంతంగా వాడుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో భూసారం నష్టపోకుండా అధిక దిగుబడులు పొందవచ్చు. ఈ ఏడాది ఖరీఫ్‌కు సిద్ధమవుతున్న నేపధ్యంలో పంట మార్పిడితో కలిగే ప్రయోజనాలపై వ్యవసాయశాఖ అధికారులు రైతులకు పలు సూచనలు చేశారు.

ఒకే పంట సాగుతో నష్టాలు

● వేరు వ్యవస్థ ఒకే లోతుకు పోవడం వల్ల ఆ లోతు వరకు ఉన్న పోషకాలు మాత్రమే మొక్కలు వినియోగించుకుంటాయి.

● ఏటా ఒకే పంట పండించడం వల్ల చీడపీడలు, కలుపు బెడద ఎక్కువగా ఉంటుంది. పైరు కూడా అభివృద్ది చెందదు. దిగుబడులు తగ్గుతాయి. రైతులకు పెట్టుబడుల భారం పెరుగుతుంది.

● నేల కోతకు గురవుతుంది. పండిన పంట నాణ్యత ఉండదు. ఫలితంగా గిటుబాటు ధర లభించదు. దీంతో రైతులకు నష్టం వచ్చే అవకాశం ఉంది.

● మార్కెట్‌ సమస్యలు ఎదురవుతాయి.

పాటించాల్సిన జాగ్రత్తలు

● ఎక్కువ లోతుకు చొచ్చుకుపోయే వ్యవస్థ ఉన్న పంట, తక్కువ లోతుకు చొచ్చుకు పోయే వేరు వ్యవస్థ ఉన్న పంటలను ఒకదాని తర్వాత ఒకటి సాగు చేయాలి. వరి, అపరాలు, జొన్న, పత్తి వంటి పంటలు వరుసగా వేయడం మంచిది.

● నేలను నిర్వీర్యం చేసే పంటలను సారాన్ని అభివృద్ధి చేసే పంటలను ఒకదాని తర్వాత ఒకటి సాగు చేసుకోవటం మేలు. ఉదాహరణకు మొక్కజొన్న, అపరాలు వంటి పంటలు.

పంట మార్పిడితో లాభాలు

పంట మార్పిడి విధానం ద్వారా అనేక లాభాలు ఉన్నాయి. వీటిపై రైతులు పూర్తి అవగాహన పెంచుకోవాలి, వరి పంట సాగు చేసే ముందు పచ్చిరొట్ట పైర్లు సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతుంది. సేంద్రీయ పదార్థం భూమిలో ఎక్కువగా ఉండడం వల్ల పైరు ఏపుగా పెరుగుతుంది. వరి తర్వాత అపరాలు, వేరుశనగ, సోయా చిక్కుడు తదితర పంటలు సాగు చేయడం వల్ల భూమిలో సేంద్రీయ పదార్థం బాగా వృద్ధి చెందుతుంది. దీంతో పంటలపై వచ్చే శీలీంద్రాల ఉధృతి తగ్గుతుంది. వరి తర్వాత చిక్కుడు జాతికి చెందిన శనగ, పెసర, మినుము, వేరుశనగ సాగు వల్ల వాటి వేర్లలోని రైజోబియన్‌ బ్యాక్టీరియా గాలిలోని నత్రజనిని తీసుకుంటాయి. వేర్లలో బుడుపుల మాదిరి ఏర్పడి తర్వాత సాగు చేసే పంటలకు మంచి సారాన్ని అందిస్తాయి.

పంట మార్పిడితో మంచి దిగుబడులు

రైతులు ఏటా ఒకే పంట సాగు చేస్తున్నారు. వరి సాగు తప్ప వేరే పంట సాగు చేసేందుకు ఆశక్తి చూపడం లేదు. దీంతో వరి పంటలో చీడపీడల బెడద ఎక్కువై సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. దీన్ని అధిగమించడానికి పంటల మార్పిడి విధానం ఉత్తమం. ఈ విధానంపై రైతులు పూర్తి అవగాహన పెంచుకోవాలి. పంట మార్పిడి వల్ల కలిగే ప్రయోజనాలు ఒకసారి అనుభవంలోకి వస్తే ఈ విధానాన్ని రైతులు కొనసాగిస్తారు.

– డి.ముత్యాలరావు, మండల వ్యవసాయాధికారి, బుట్టాయగూడెం

పాడి– పంట

భూసారం వృద్ధి, చీడ పీడల నివారణ

రైతులకు అవగాహన కల్పిస్తున్న వ్యవసాయ సిబ్బంది

పంట మార్పిడితో అధిక దిగుబడి 1
1/3

పంట మార్పిడితో అధిక దిగుబడి

పంట మార్పిడితో అధిక దిగుబడి 2
2/3

పంట మార్పిడితో అధిక దిగుబడి

పంట మార్పిడితో అధిక దిగుబడి 3
3/3

పంట మార్పిడితో అధిక దిగుబడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement