
శ్రీవారిని దర్శించుకున్న నటుడు సుప్రీత్రెడ్డి
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రాన్ని సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుప్రీత్రెడ్డి (కాట్రాజ్) శనివారం మధ్యాహ్నం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయన ముందుగా శ్రీవారు, అమ్మవార్లను దర్శించారు. అనంతరం అర్చకుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగారు. సుప్రీత్రెడ్డి ఛత్రపతి, మిర్చి, మర్యాద రామన్న, ఎక్స్ప్రెస్ రాజా, ఆగడు, బలుపు వంటి చిత్రాల్లో నటించారు.
గోదావరిలో పడి యువకుడి మృతి
కుక్కునూరు : గోదావరిలో స్నానం చేసేందుకు సరదాగా స్నేహితులతో దిగిన యువకుడు గోదావరిలో మునిగి మృతిచెందిన ఘటన శనివారం మండలంలోని మాధవరం రేవు వద్ద జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. వేలేరుపాడు మండలం చాగరపల్లికి చెందిన మొట్టెం చరణ్ (20) శనివారం మధ్యాహ్నం కుక్కునూరు మండలంలోని బంజరుగూడెం గ్రామంలో మరో ఇద్దరు స్నేహితులతో కలిసి వివాహానికి హాజరయ్యాడు. భోజనం అనంతరం తిరుగు ప్రయాణంలో మాధవరం గ్రామంలో స్నేహితులు ఉండటంతో ఆగాడు. అక్కడ మరో నలుగురు స్నేహితులతో కలిసి గోదావరిలో ఈత కొట్టేందుకు దిగారు. దిగిన వారెవరికీ ఈత రాకపోవడం, చరణ్ లోతును గమనించకుండా ముందుకు వెళ్లడంతో ఒక్కసారిగా గోదావరిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకుని స్థానిక జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టగా, రాత్రి 8 గంటల సమయంలో చరణ్ మృతదేహం లభ్యమైంది.
సింహవాహనంపై గ్రామోత్సవం
అత్తిలి: మండలంలో ఈడూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవరాల వెంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం స్వామికి నిత్యార్చనలు, ప్రత్యేక పూజలు జరిపారు. వేదపారాయణం నిర్వహించారు. సాయంత్రం సింహవాహనంపై శ్రీస్వామి, అమ్మవార్లను ఉంచి మేళతాళాల నడుమ శ్రీస్వామివారి గ్రామోత్సవం వైభవంగా జరిపారు. దండు శ్రీనివాసరాజు, ఉమాలక్ష్మిదేవి దంపతుల సౌజన్యంతో శ్రీవెంకటేశ్వర సంబరం నిర్వహించారు. ఆలయ అర్చకులు వాడపల్లి శేఖరాచార్యులు ఆధ్వర్యంలో పూజాదికాలు జరిపారు.

శ్రీవారిని దర్శించుకున్న నటుడు సుప్రీత్రెడ్డి