
చెరువు మట్టి అక్రమార్కుల పాలు
నూజివీడు: పొలంలో మెరక నిమిత్తం మట్టి కావాలని అనుమతులు తీసుకుని చెరువు మట్టిని తవ్వి యథేచ్ఛగా విక్రయిస్తూ టీడీపీ నాయకులు జేబులు నింపుకుంటున్నారు. నూజివీడు పట్టణంలోని పెద్దచెరువులో పొలం మెరక చేసుకోవాలనే ముసుగులో అనుమతులు పొంది మట్టిని వాణిజ్య అవసరాలకు, ఇతర అవసరాలకు అక్రమార్కులు అమ్మేస్తున్నారు. రెండు రోజుల నుంచి అక్రమ మట్టి తవ్వకాలు ఇష్టారాజ్యంగా జరుగుతున్నా ఇటు ఇరిగేషన్ అధికారులు గాని, అటు రెవిన్యూ అధికారులు గాని పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ట్రాక్టరు మట్టిని రూ.1000 నుంచి రూ.1200కు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పొక్లెయిన్కు టక్కులో మట్టిని పోసినందుకు రూ.150 ఇస్తుండగా మిగిలిన మొత్తం ట్రాక్టర్ కిరాయి కింద వసూలు చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇంత రేటు గతంలో ఎన్నడూ లేదని రాజకీయ వర్గాల్లోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మెరక నిమిత్తం అనుమతులు తీసుకొని..
పట్టణానికి చెందిన వీవీ కృష్ణారావు నూజివీడులోని సర్వే నెంబరు 871–3లోని ఎకరం విస్తీర్ణం గల వ్యవసాయ భూమిని మెరక చేసుకునే నిమిత్తం అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోగా, తహసీల్దార్, స్థానిక ఇరిగేషన్ డీఈ సిఫార్సుల మేరకు ఇరిగేషన్ ఈఈ 1000 క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని వారి సొంత ఖర్చులతో తవ్వి తోలుకునేందుకు అనుమతి ఇచ్చారు. అది కూడా ఈనెల 1 వరకు మాత్రమే అనుమతినివ్వగా గత రెండు రోజుల నుంచి పెద్ద చెరువులోని మట్టిని అధికార పార్టీకి చెందిన నాయకులు యథేచ్ఛగా, విచ్చలవిడిగా తోలుతూ విక్రయిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ, ఇంజినీరింగ్ అధికారులు మట్టి తవ్వడానికి మార్కింగ్ ఇచ్చిన చోట నుంచి తవ్వకుండా నాయకులు వేరొక చోట తవ్వుతూ మట్టిని ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీ వరకు మాత్రమే అనుమతి ఉండగా, ఈ నెల 6వ తేదీ నుంచి రెండు జేసీబీలతో మట్టిని తవ్వి తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇరిగేషన్ ఏఈ, డీఈ ఏమాత్రం పట్టించుకోకుండా టీడీపీ నాయకులకు జీ హుజూర్ అంటున్నారు. అధికార పార్టీ వారు కావడంతో అధికారులు కళ్లు మూసుకొని కూర్చుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెరువులో నుంచి తరలిస్తున్న మట్టిని అనుమతి తీసుకున్న పొలం మెరకకు ఉపయోగించకుండా పట్టణంలో ఎవరు కావాలంటే వారికి అమ్మేసుకుంటున్నారు. ప్రజల ఇంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతుంటే పట్టించుకోవాల్సిన ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకుండా వదిలేయగా, రెవిన్యూ అధికారులు సైతం ఇరిగేషన్ అధికారుల బాటలోనే నడుస్తున్నారు. పార్కు మెరక పేరుతో పెద్ద దోపిడీకి స్కెచ్ వేశారు. ఎలాంటి నిధులు మంజూరు కాకుండానే కొప్పుల వెలమపేటలో పార్కు అభివృద్ధి పనులను టీడీపీ నాయకుడొకరు చేస్తుండగా ఆ పార్కులోకి మెరక నిమిత్తం పెద్ద ఎత్తున మట్టిని తోలుతున్నారు. వాస్తవంగా నిధులు మంజూరయ్యాక టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ను నిర్ణయించి వర్క్ఆర్డర్ ఇచ్చిన తరువాత పనులు చేయాల్సి ఉండగా, అలాంటివేమీ లేకుండానే పార్కు అభివృద్ధి అంటూ పనులు చేస్తున్నారు. తరువాత మెరక పేరుతో భారీ ఎత్తున బిల్లులు చేసుకోవడానికే ఇదంతా చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పొలం మెరక కోసం అనుమతులు.. వేరే అవసరాలకు తరలింపు
ట్రక్కు రూ.1000 నుంచి రూ.1200కు అమ్ముకుంటున్న అక్రమార్కులు

చెరువు మట్టి అక్రమార్కుల పాలు