
కూటమి అండదండలతో కబ్జాలు
కొయ్యలగూడెం: కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భూములే కాకుండా ప్రజల భూ ములు కూడా కబ్జాలకు గురవుతున్నాయని అందు కు ఉదాహరణగా కొయ్యలగూడెంలోని సర్వే నంబర్ 311/2 నిలిచిందని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఆయన శనివారం కొయ్యలగూడెం వచ్చిన సమయంలో సమయంలో టీటీడీ కల్యాణ మండప ప్రాంతవాసులు తమ భూముల కబ్జాపై ఆయన వద్ద మొరపెట్టుకున్నారు. కోట్ల రూపాయల విలువైన భూమి గురించి ఇప్పటికే సమగ్రంగా విషయాలను సేకరించానని, చిన్నపాటి లొసుగులను భూతద్దంలో చూపించి భూముల కబ్జాకు పన్నాగం నడుస్తోందని బాలరాజు అన్నా రు. ఈ విషయంలో ప్రజలను కంగారు పడవద్దని ఓ పక్క చెబుతూ మరోపక్క ఆక్రమణదారులకు కూటమి నాయకులు వెన్ను కాస్తున్నారని ఆరోపించారు. 40 ఏళ్లకుపైగా నివాసముంటున్న స్థానికుల జోలికి వస్తే పర్యవసానం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. రెవెన్యూ అధికారులు కూటమి నేతల ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ గంజిమాల రామారావు, పార్టీ రాష్ట్ర బీసీ సెల్ సహాయ కార్యదర్శి గంటా శీను, పట్టణ కన్వీనర్ సంకుకొండ, ఘంటసాల సాయి, మారిశెట్టి శ్రీను, చిటికెన నాగార్జున, తొంటా వాసు ఉన్నారు.