
నేటినుంచి ప‘రేషన్’!
భీమవరం: రేషన్ కార్డుదారులకు చౌక డిపోల వద్దనే నిత్యావసర సరుకులు తీసుకునే కార్యక్రమాన్ని ఆదివారం కూటమి ప్రభుత్వం ప్రారంభించనుంది. కార్డుదారులు రేషన్ షాపుల వద్ద గంటల తరబడి క్యూల్లో నిలబడి మోయలేని బరువుతో ఎక్కువ దూరం తీసుకువెళ్లాల్సిన పరిస్థితులు పునరావృతం కానున్నాయి. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ నిత్యావసర సరుకులు అందించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జ్ఞాపకాలను చెరిపేసే ఉద్దేశంతో రేషన్ డిపోల వద్దనే సరుకుల పంపిణీకి చేస్తున్న ఏర్పాట్లను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. జిల్లాలో 5,67,671 రేషన్ కార్డులకు 1,060 డిపోల ద్వారా ద్వారా నెలకు సుమారు 8,700 టన్నుల బియ్యం, 567 టన్ను కందిపప్పు, 300 టన్నుల పంచదార పంపిణీ చేయాల్సి ఉంది. ఇందుకోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 356 ఎండీయూ వాహనాలను ఏర్పాటు చేసి వందలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఇంటి వద్దకే సరుకులు అందించి వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఊరట కల్పించింది.
ఇకపై పడిగాపులే..
సరుకులు పొందాలంటే ఇక నుంచి గంటల పాటు చౌకడిపోల వద్ద పడిగాపులు తప్పవని కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. సర్వర్ పనిచేయడం లేదంటూ, వేలిముద్రలు పడటం లేదంటూ రోజుల తరబడి చౌక డిపోల చుట్టూ తిప్పుతారని వాపోతున్నారు. బియ్యం మూటలతో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందులు పడతామని అంటున్నారు. దివ్యాంగులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ ఇస్తామని కూటమి ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో ఎంతవరకు సాధ్యమని డీలర్లు పెదవి విరుస్తున్నారు. తాము సరుకులు తీసుకువెళ్లిన సమయంలో కార్డుదారులు వారి ఇంటి వద్ద లేకపోతే సమస్యలు తప్పవని డీలర్లు అంటున్నారు. మొత్తంగా ఎండీయూ వ్యవస్థ రద్దు, చౌక డిపోల ద్వారా రేషన్ పంపిణీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇక రేషన్ దుకాణాల్లోనే సరుకుల పంపిణీ
క్యూలైన్లలో గంటల తరబడి ఎదురుచూపులు తప్పవు
దూరాభారమైనా మోయలేని బరువులతో యాతనలే..
సర్వర్ పనిచేయక వేలిముద్రలు పడకపోతే మరింత ఇబ్బందులు