
చెస్ విజేతలకు బహుమతుల ప్రదానం
భీమవరం : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీల్లో విజేతలకు శుక్రవారం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం అధ్యక్షుడు వబిలి శెట్టి వెంకటేశ్వరరావు బహుమతులు అందించారు. అనంతరం మాట్లాడుతూ పిల్లలు చదరంగంలో పోటీ పడడమేగాక పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచి పోషించడంలో ముందుండాలన్నారు. చదరంగం నేర్చుకోవడం ద్వారా మేధాశక్తిని పెంపొందించుకుని విద్యలో రాణించవచ్చన్నారు. ప్రథమ బహుమతి డి.సురేష్ (పాలకొల్లు), ద్వితీయ బహుమతి ఎన్.వరుణ్ తేజ్ (భీమవరం), తృతీయ బహుమతి ఎ.రామకృష్ణ (విజయవాడ) అందుకున్నారు. చెస్ పోటీల నిర్వాహకుడు మాదాసు కిషోర్, సురేష్ జైన్, నోముల రామారావు, సునీల్, గౌరవ్ తదితరులు పాల్గొన్నారు.
బాలికల హాకీ పోటీలు ప్రారంభం
భీమవరం: రాష్ట్ర స్థాయి 15వ అంతర్ జిల్లాల బాలికల హాకీ పోటీలు శుక్రవారం భీమవరం డీఎన్నార్ కళాశాల ఆవరణలో ప్రారంభమయ్యాయి. పోటీలను ప్రారంభించి డీఎన్నార్ కళాశాల ప్రిన్సిపల్ జి.మోజెస్, పీడీ బీవీ నర్సింహరాజు మాట్లాడుతూ క్రీడలు శారీరక దారుడ్యానికి, మానసిక ప్రశాంతతకే గాకుండా ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కలిదిండి ఆనందరాజు, కేవీఎస్ భరత్ మాట్లాడుతూ మూడు రోజులపాటు నిర్వహించే హాకీ పోటీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి 16 జట్లు పాల్గొంటున్నట్లు చెప్పారు. అనంతరం పశ్చిమగోదావరి– కృష్ణా జిల్లా జట్ల మధ్య జరిగిన పోటీల్లో పశ్చిమగోదావరి జట్టు కృష్ణా జట్టుపై విజయం సాధించింది.
విద్యుత్ వైర్లు తగిలి లారీకి మంటలు
తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలో కడకట్ల శివారు ఖాళీ స్థలాల వద్ద శుక్రవారం లారీకి విద్యుత్ వైర్లు తగిలి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది వివరాల ప్రకారం..లారీకి విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ లారీ నుంచి దూకి తప్పించుకున్నాడు. సిమెంట్ పని మీద వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంక్ ఉన్న వైపు మంటలు చెలరేగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఫైర్ ఆఫీసర్ జీవీ రామారావు ఆధ్వర్యంలో సిబ్బంది మంటలు అదుపు చేశారు.

చెస్ విజేతలకు బహుమతుల ప్రదానం

చెస్ విజేతలకు బహుమతుల ప్రదానం