●
ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీ
బక్రీద్ సందర్భంగా ప్రతి ముస్లిం విధిగా పొట్టేలు మాంసాన్ని ఖుర్బానీ ఇచ్చి పేదలకు పంచడం ఆనవాయితీ. ఈ పండుగ సందర్భంగా ముస్లింలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా అతి పవిత్రమైన మక్కాను సందర్శించి ముక్తి పొందాలి.
– మహమ్మద్ అబ్దుల్ వదూద్,
జామియా మసీదు ఇమామ్
త్యాగ నిరతికి ప్రతీక
బక్రీద్ పండుగ మనిషి దైవ భీతిని, త్యాగ నిరతిని తెలియజేస్తుంది. ఈ పండుగను త్యాగాల పండుగ అంటారు. అంతేకాకుండ చనిపోయిన కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని వారి పేరున ఖుర్బానీ ఇవ్వడం ఈ పండుగ ప్రత్యేకత.
– సయ్యద్ బాబు, జామియా మసీదు అధ్యక్షుడు, చింతలపూడి
చింతలపూడి: ముస్లింలు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో బక్రీద్ ఒకటి. ధనిక, పేద తారతమ్యం లేకుండ ప్రతి ముస్లిం బక్రీద్ పండుగను జరుపుకుంటారు. పవిత్ర త్యాగానికి ప్రతిరూపమైన దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం అల్లా ప్రసన్నం కోసం చేసిన మహోన్నత త్యాగాన్ని ఈ పండుగ సందర్భంగా ముస్లింలు స్మరించుకుంటారు. ఇస్లాం మతంలో రంజాన్ తరువాత అంత ప్రాముఖ్యత ఉన్న పండుగ ఈదుల్ జుహా (బక్రీద్). శనివారం దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు బక్రీద్ను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఖుర్బానీ ఇవ్వడం అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. గొర్రె పొట్టేలు మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని నిరుపేదలకు పంచి పెడతారు. మిగిలిన భాగాలలో రెండో దాన్ని బంధువులకు, మూడో భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. దీన్నే ఖుర్బానీ అంటారు. ముస్లింలు ఈ మాసంలోనే హజ్ యాత్ర చేస్తారు. పవిత్ర స్థలం మక్కాను సందర్శించడానికి ఇష్టపడతారు. సౌదీ అరేబియాలోని మక్కా వెళ్ళి కాబా చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేస్తారు. బక్రీద్ సందడి జిల్లాలోని ముఖ్యమైన ప్రాంతాల్లో మొదలైంది. పండుగ సందర్భంగా పొట్టేళ్లు, గొర్రెలు, మేకల విక్రయాలు, కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఖుర్బానీ ఇవ్వడం కోసం ఇప్పటికే కొందరు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పొట్టేళ్లను కొనుగోలు చేసి తెచ్చుకున్నారు. మరికొద్ది మంది తాడేపల్లిగూడెం, గుంటూరు, మచిలీపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి ఖుర్బానీ కోసం సిద్ధం చేసుకున్నారు. స్ధానికంగా కొందరు వ్యాపారులు ఏడాది పొడవునా పొట్టేళ్లను పెంచి విక్రయిస్తుంటారు. ఒక్కో పొట్టేలు రూ.10 వేల నుండి రూ. 20 వేల వరకు ధర ఉంటుందని వ్యాపారులు తెలిపారు. జిల్లాలోని ఏలూరు, నూజివీడు, తాడేపల్లిగూడెం, తణుకు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, ఆకివీడు, పోలవరం తదితర ప్రాంతాల్లో బక్రీద్ను ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సుమారు 5 కోట్లకు పైగా పొట్టేళ్ళ వ్యాపారం జరుగుతుందని అంచనా.
పొట్టేళ్ళకు గిరాకీ
బక్రీద్ వస్తుందంటే పొట్టేళ్ళకు గిరాకీ పెరుగుతుంది. వారం రోజుల నుంచి మెట్ట ప్రాంతంలో పండుగ సందర్భంగా కొత్తబట్టలు, పండుగ సామాగ్రి కొనుగోలు చేశారు. ఖుర్బానీ ఇవ్వడానికి గొర్రెలు, మేకలను దూర ప్రాంతాల నుంచి కొనుగోలు చేశారు. పండుగ అయిపోయిన తరువాత నెల మొత్తం ఖుర్బానీ ఇచ్చుకునే అవకాశం ఉండటంతో పొట్టేళ్ల అమ్మకాలు సాగనున్నాయి.
నేడు ఖుర్బానీ ఇవ్వనున్న ముస్లింలు
ఈ నెలలో పవిత్ర మక్కా సందర్శన
త్యాగానికి ప్రతీక బక్రీద్
త్యాగానికి ప్రతీక బక్రీద్
త్యాగానికి ప్రతీక బక్రీద్