
నేత్రపర్వంగా వరాల వెంకన్న కల్యాణం
అత్తిలి: మండలంలోని ఈడూరు గ్రామంలో వేంచేసియున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవరాల వెంకటేశ్వరస్వామివారి కల్యాణం నేత్రపర్వంగా జరిగింది. స్వామి, అమ్మవార్లకు గజవాహన సేవ నిర్వహించారు. సుదర్శన సాయిరామాచార్యులు ఆధ్వర్యంలో వాడపల్లి శేఖరాచార్యులు, విఖన్ బాబు, పలువురు వేదపండితుల సమక్షంలో స్వామి కల్యాణం నిర్వహించారు. దారాబత్తుల సత్యనారాయణ దంపతులచే మంగళసూత్రాలు, సమతం వెంకటేశ్వరరావు దంపతులచే ముత్యాల తలంబ్రాలను స్వామి, అమ్మవార్లకు సమర్పించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. శుక్రవారం తీర్ధమహోత్సవం జరిగింది. ఆలయప్రాంగణంలో కోలాట బృందంచే హరే శ్రీనివాస్ భజన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అఖండ అన్నసమారాధన జరిగింది. సాయంత్రం స్వామి,అమ్మవార్లను పుష్పాలతో అలంకరించిన రథంపై ఉంచి మేళతాళాలు, మంగళవాద్యాలు, ఆసాదుల గరగనృత్యాలు నడుమ రథోత్సవం వైభవోపేతంగా జరిపారు.

నేత్రపర్వంగా వరాల వెంకన్న కల్యాణం