
వర్షాకాలంలో పశువులకు వ్యాధుల ముప్పు
బుట్టాయగూడెం: ముందస్తు వర్షాలు కురవడంతో పాటు వానాకాలం రావడంతో పశువులు, గొర్రెలు ఇతర జీవాలకు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచిస్తున్నారు. జీవాలకు వచ్చే వ్యాధులను గుర్తించిన వెంటనే సకాలంలో అందుబాటులో ఉన్న పశువైద్యాధికారిని సంప్రదించి సరైన చికిత్స అందించాలని సూచిస్తున్నారు.
బ్లూ టంగ్– ఫుట్ రాట్ లక్షణాలు
గొర్రెలు, మేకల్లో బ్లూటంగ్ వ్యాధులు సోకితే ఎక్కువగా జ్వరం, మూతివావు, నోటిలోపల పుండ్లు, ముక్కులో చీమిడి, కాళ్లు కుంటడం, ఒంట్లో నీరు చేరడం, పారుకోవడం, మేత మేయకపోవడం, ఈసుకుపోవడం (అబార్షన్లు) వంటి లక్షణాలు ఉంటాయి. వీటి నివారణకు సాయంత్రం సమయంలో గొర్రెల మందలో వేపాకు పొగ పెట్టుకుంటూ అప్పుడప్పుడూ బ్లూటాక్స్/టిక్కిల్ మందులు పిచికారీ చేస్తూ పోడు ప్రాంతాల్లో మేతకు తీసుకెళ్లాలి.
కాళ్ల పుండ్ల వ్యాధి
జీవాలకు కాళ్ల పుండ్లు వ్యాధి సోకితే కాలి గిట్టల మధ్య చీము చేరి చెడువాసన వస్తుంది. గొర్రెలు కుంటుతూ నడుస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు జీవాలను బురద ప్రాంతంలో మేపకూడదు. పొడి ప్రాంతంలోనే మేసేలా చూడాలి.
గొంతు వాపు వ్యాధి
పశువులకు సోకే వ్యాధుల్లో గొంతువాపు ప్రమాదకరమైంది. ఈ వ్యాధిని గురక వ్యాధి అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మజీవుల వల్ల సంక్రమిస్తుంది. తొలకరి వర్షాలు పడిన సమయంలో కలుషితమైన నీటి ద్వారా, మేత ద్వారా పశువులకు రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ వ్యాధుల బారిన పడతాయి. గొంతువాపు వ్యాధి బారిన పడిన పశువులను మిగిలిన పశువులతో కలిపి ఉంచితే ఈ వ్యాధి మిగిలిన వాటికి కూడా వ్యాప్తి చెందుతుంది. ఒకేపాకలో మిగతావాటితో ఉంచకుండా వేరుగా ఉంచాలి. వర్షాకాలంలో పశువులు వర్షాలకు తడవకుండా చూడాలి.
నివారణ చర్యలు
జూన్, జులై, ఆగస్టు నెలలో వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. పౌష్టికాహారం అందించాలి. వ్యాధి సోకిన పశువులను మిగిలినవాటి నుంచి వేరు చేయాలి. వాటి స్థావరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలి.
చికిట వ్యాధి
ఇది గొర్రెల్లో ఎక్కువగా వస్తుంది. ఎంటరోటాక్సీమియా అనే బ్యాక్టీరియా వల్ల తొలకరి వర్షాలు కురిసే సమయంలో ఈ వ్యాధి గొర్రెలకు సోకుతుంది. ఏడాది వయసున్న గొర్రెల్లో ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి సోకిన గొర్రె తక్కువ సమయానికే మరణిస్తుంది. ఈ వ్యాధి సోకిన గొర్రెలు నీరసిస్తాయి. కొద్దిసేపటికే గొర్రెలు గిలగిలా కొట్టుకుని గాలిలో ఎగిరి కిందపడి మరణిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలను ఉదయం, మధ్యాహ్న వేళల్లో గొర్రెల్లో కనిపిస్తాయి. వర్షాలకు ముందే గొర్రెలకు ఈ వ్యాధి రాకుండా టీకాలు వేయించాలి. వ్యాధి సోకిన గొర్రెలను మంద నుంచి వేరు చేయాలి.
పాడి– పంట
సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం
ముందుగానే టీకాలు వేయడం ఉత్తమం: వైద్యులు
వ్యాధుల పట్ల జాగ్రత్తలు అవసరం
వర్షాకాలంలో పశువులకు వచ్చే వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉన్నందున ముందుగానే టీకాలు వేయించుకోవడం ఉత్తమం. వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే పశువుల ప్రాణాలకు ముప్పు. వ్యాధులను గుర్తిస్తే దగ్గరలో ఉన్న పశువుల ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించాలి. సకాలంలో వైద్యం అందేలా చూడాలి.
– డాక్టర్ మల్లంపల్లి సాయి బుచ్చారావు, సహాయ సంచాలకులు ప్రాంతీయ పశు సంవర్థక శాఖ, జీలుగుమిల్లి

వర్షాకాలంలో పశువులకు వ్యాధుల ముప్పు

వర్షాకాలంలో పశువులకు వ్యాధుల ముప్పు

వర్షాకాలంలో పశువులకు వ్యాధుల ముప్పు