
తెప్పను సిద్ధం చేస్తున్న సిబ్బంది, పుష్కరిణిలో నాచు, చెత్తను తొలగిస్తున్న సిబ్బంది
ద్వారకాతిరుమల: చినవెంకన్న తెప్పోత్సవానికి శ్రీవారి పుష్కరిణి (నృసింహ సాగరం) సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 24న రాత్రి స్వామివారి తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా పుష్కరిణి మధ్యలో ఉన్న మండపాన్ని, సాగర పరిసరాలను, తెప్పను రంగులతో తీర్చిదిద్దుతున్నారు. గట్లపై ఉన్న ముళ్ల పొదలను తొలగించి, విద్యుద్దీప అలంకారాలు చేస్తున్నారు. అలాగే పుష్కరిణిని బోరు నీటితో నింపుతున్నారు. ఉత్సవం జరిగే రోజు రాత్రి స్వామివారు ఉభయదేవేరులతో కలసి తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగి, 8 గంటల సమయంలో పుష్కరిణి వద్దకు చేరుకుంటారు. ఆ తరువాత తెప్పోత్సవం ప్రారంభమౌతుందని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. భక్తులు ఈ వేడుకలో భారీగా పాల్గొనాలని ఆయన కోరారు.
