బరుల తయారీలో టీడీపీ నేతలు
మండవల్లి : మండవల్లి మండలం ఉనికిలిలో సంక్రాంతి పండుగకు కోడిపందేల నిర్వహణకు టీడీపీ నాయకులు బరులు సిద్ధం చేస్తున్నారు. ఇంతవరకు గ్రామంలో సంక్రాంతికి పేకాట, కోడి పందేలు పెట్టిన దాఖలాలు లేవు. గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల ప్రాంతంలో టీడీపీ నాయకులు కోడిపందేల నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పేకాట కోడిపందేలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.
ఏలూరు(మెట్రో): జెడ్పీ పీఎఫ్ ఖాతాలను ఆన్లైన్ చేసి ఖాతాదారులకు అందుబాటులో ఉంచాలని ఏపీటీఎఫ్ అధ్యక్షుడు టి.రామారావు, జనరల్ సెక్రటరీ బి.రెడ్డిదొర కోరారు. బుధవారం జెడ్పీ సీఈవోకు వినతిపత్రం అందజేశారు. జెడ్పీ పీఎఫ్ ఖాతాలను ఆన్లైన్ చేయడం వల్ల ఖాతాదారులకు వారి ఖాతాలలో నిల్వల గురించి తెలియడంతో పాటు, మిస్సింగ్ క్రెడిట్స్ను వెంటనే సరి చూసుకునే అవకాశం కలుగుతుందన్నారు. రుణ దరఖాస్తులను సాధ్యమైనంత తొందరగా పరిశీలించి రుణాలను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఏలూరు (ఆర్ఆర్పేట) : విద్య ఒక్కటే అభివృద్ధికి మార్గమని, ప్రతి విద్యార్థి ఇష్టంతో చదివి మంచి ఫలితాలు సాధించడం ద్వారా కుటుంబ, దేశ అబివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కే రత్నప్రసాద్ పిలుపునిచ్చారు. యువజన అవగాహన వారోత్సవాల్లో భాగంగా కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బుధవారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు కష్టపడి విద్యార్థుల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడతారని, వారి కలలు సాకారం చేయడానికి తమవంతు కృషిచేయాలని సూచించారు.
నూజివీడు: ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 10 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ తెలిపారు. సెలవుల అనంతరం ఈనెల 19న ట్రిపుల్ ఐటీల్లో తరగతులు పునఃప్రారంభమవుతాయన్నారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ నుంచి విద్యార్థినులు తమ ఇళ్లకు చేరుకునేందుకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి 45 బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
భీమవరం(ప్రకాశం చౌక్): ఏపీఎన్జీవో పశ్చిమగోదావరి జిల్లా అసోసియేషన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. భీమవరంలోని శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో జరిగిన సమావేశంలో పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా యువీ పాండురంగారావు, కార్యదర్శిగా సుకుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్గా అల్లూరి శ్రీనివాసరాజు, ట్రెజరర్గా కృష్ణప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా హరిప్రసాద్బాబు, 17 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఉమెన్ వింగ్ చైర్మన్గా కె.గౌరి, కన్వీనర్గా పి.కిర్తీ, క్యాషియర్గా సీహెచ్.ధనలక్ష్మీ, 14 మంది సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి ఏలూరు జిల్లా అధ్యక్షుడు చొడగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
బరుల తయారీలో టీడీపీ నేతలు
బరుల తయారీలో టీడీపీ నేతలు


