కోరుకొండ: స్థల వివాదంలో ఓ వ్యక్తి హత్యాయత్నానికి ఇద్దరిపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన కోరుకొండలో జరిగింది. ఎస్సై ఆర్.శివాజీ కథనం ప్రకారం.. స్థానిక సాంబశివరావు కాలనీకి చెందిన గోపిశెట్టి శ్రీనివాస్, అతడి తల్లి సూర్యకాంతానికి, శ్రీరంగపట్నానికి చెందిన దొడ్డి కొండయ్య కుటుంబాల మధ్య కాలనీలోని ఓ స్థలం విషయంలో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం కొండయ్య గురువారం శ్రీనివాస్ ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. కత్తితో నరకడంతో పొట్టపై తీవ్ర గాయమైంది. అతడి తల్లి సూర్యకాంతంపై కూడా కొండయ్య దాడి చేయడంతో ఆమె తలపై తీవ్ర గాయమైంది. తల్లీకొడుకులిద్దరూ అపస్మారక స్థితికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న సీఐ ఎస్వీవీఎస్ మూర్తి, ఎస్సై శివాజీలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులిద్దరినీ తొలుత పీహెచ్సీకి, అక్కడి నుంచి అత్యవసర చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్యాయత్నానికి పాల్పడిన కొండయ్యను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శివాజీ తెలిపారు.
● కత్తితో దాడి ● ఇద్దరికి తీవ్ర గాయాలు


