● నలుగురి అరెస్టు
● రూ.71 లక్షల సొత్తు స్వాధీనం
తుని: నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి, 125 కేజీల గంజాయి, భారీగా సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక సీతారామపురంలోని ఓ పాత పెంకుటింట్లో గంజాయి నిల్వ చేసి విక్రయిస్తున్నారంటూ తుని టౌన్ పోలీసులు, ఏపీ ఈగల్ టీముకు సమాచారం అందింది. ఈ మేరకు గురువారం దాడి చేసి, గంజాయి విక్రయం, రవాణా చేస్తున్న అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉద్దండపురానికి చెందిన బొండాడ కోదండరామ్, పాయకరావుపేటకు చెందిన పులిబంటి వెంకట ప్రసాద్, అల్లూరి సీతారామరాజు జిల్లా కేడీ పేటకు చెందిన ఇంటి సంతోష్, కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం పైడిపాలకు చెందిన పేరూరి శ్రీనులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.62 లక్షల విలువైన 125 కేజీల గంజాయి, కారు, ప్యాసింజర్ ఆటో, స్కూటీ, పల్సర్ బైక్, 5 సెల్ఫోన్లు, రూ.3.41 లక్షల నగదు కలిపి మొత్తం రూ.71 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అల్లూరి జిల్లా ఏజెన్సీలో గంజాయి కొనుగోలు చేసి, ఇక్కడి పెంకుటింట్లో నిల్వ చేసి, హైవేపై లారీలు, ప్రైవేటు బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల్లో బట్టల బ్యాగులు, పండ్ల బాక్సుల రూపంలో ప్యాక్ చేసి తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీరు వివిధ కేసుల్లో నేరస్తులుగా ఉండి, బెయిల్పై బయట తిరుగుతున్నారు. ఈ కేసును ఛేదించిన పట్టణ సీఐ గీతా రామకృష్ణ, ఎస్సై, రావూరి వెంకటరత్నం, ఇతర సిబ్బందిని ఎస్పీ బిందుమాదవ్, డీఎస్పీ తిలక్ అభినందించారు.


