అమలాపురం టౌన్: పట్టణంలోని అశ్వని పిల్లల ఆస్పత్రిలో ఓ బాలింత పొగొట్టుకున్న 12 గ్రాముల బంగారు పుస్తెలతాడును పట్టణ పోలీసులు 48 గంటల్లో రికవరీ చేశారు. వివరాలివీ.. అయినవిల్లి మండలం అయినవిల్లి లంక గ్రామానికి చెందిన బాలింత పొలినాటి నందిని తన ఐదు నెలల బిడ్డకు ఒంట్లో బాగోలేకపోతే ఆస్పత్రిలో చేరింది. డిశ్చార్జి అయ్యే ముందు స్నానం చేస్తూ మంగళవారం తన మెడలోని బంగారు పుస్తెలతాడును తీసి, ఆస్పత్రి బాత్ రూములో పెట్టి, మరచిపోయింది. సొంతూరు వెళ్లిన తరువాత పుస్తెలతాడు మరచిపోయిన విషయాన్ని గుర్తించి, వెంటనే అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్కు చేరుకుని, పట్టణ సీఐ పి.వీరబాబుకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రి సీసీ ఫుటేజీలను పరిశీలించి, సాంకేతికత ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆస్పత్రికి వచ్చిన మరో రోగి బాత్ రూముకు వెళ్లిన సమయంలో ఆ పుస్తెలతాడును గుర్తించి, ఎవ్వరికీ చెప్పకుండా దాచేసుకుంది. సీఐ వీరబాబు, క్రైమ్ ఎస్సై అయితాబత్తుల బాలకృష్ణ విచారణ జరిపి, దాదాపు రూ.లక్ష విలువైన ఆ బంగారు పుస్తెలతాడును ఆ రోగి నుంచి స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పోలీసు స్టేషన్లో బాధిత మహిళ నందినికి సీఐ వీరబాబు గురువారం ఆ పుస్తెలతాడు అందజేశారు.


