సీటీఆర్ఐ: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వస్తున్న అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ నిర్వహించారు. మొత్తం 171 అర్జీలు రాగా, ఇందులో రెవెన్యూ క్లినిక్కు సంబంధించి 83 అర్జీలు ఉన్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో ఇప్పటివరకు స్వీకరించిన అర్జీల పరిష్కార పురోగతి, పెండింగ్ అర్జీలు, అసంతృప్తి ఫిర్యాదులు తదితర అంశాలను క్షణ్ణంగా పరీశీలించాలన్నారు. ఫిర్యాదుదారులకు సంతృప్తికర పరిష్కారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్, సహాయ కలెక్టర్ కె.ఆదిత్యశర్మ, డీఆర్ఓ ఎస్.భాస్కర్రెడ్డి, ఆర్డీఓలు ఆర్.శివరాముడు, కె.ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ పీజీఆర్ఎస్కు
18 అర్జీలు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 18 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్ అర్జీదారుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను విని ఆయా స్టేషన్ల పరిధిలో పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఫిర్యాదిదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ అర్జీల్లో సివిల్, చీటింగ్, కొట్లాట కేసులు, కుటుంబ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి.


