కొత్తపేట: అమలాపురం – విజయవాడ ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి రాళ్లతో దాడి చేసి పరారయ్యాడు. ప్రయాణికుల వివరాల ప్రకారం.. అమలాపురం ఆర్టీసీ డిపోనకు చెందిన అమలాపురం – విజయవాడ బైపాస్ సర్వీస్ సెమీ లగ్జరీ బస్సు ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు కొత్తపేట బోడిపాలెం వంతెన సమీపంలో బాబా గుడి దాటాక ఓ వ్యక్తి బస్సు ముందు నుంచి రాళ్లతో దాడి చేశాడు. దీంతో షాక్కు గురైన డ్రైవర్ షడన్ బ్రేక్ వేసి స్టీరింగ్పై సొమ్మసిల్లి పడిపోయాడు. అద్దం పగిలి చేతికి స్వల్ప గాయమైంది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. అయితే వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే 108కు ఫోన్ చేసి డ్రైవర్ను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పి.గన్నవరానికి చెందిన డ్రైవర్ కూనపరెడ్డి ఆదినారాయణమూర్తి కోలుకోగా, ప్రయాణికుల నుంచి పోలీసులు వివరాలు తీసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి కొత్తపేట మండలం ఖండ్రిగ పరిసర ప్రాంతం నుంచి నుంచి బైక్పై పాలో అయ్యి వచ్చి బస్సుపై దాడికి పాల్పడినట్టు పలువురు తెలిపారు. ఈ సమాచారం తెలిసిన వెంటనే అమలాపురం డిపో అసిస్టెంట్ మేనేజర్ ప్రతిమాకుమారి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ బస్సులో ప్రయాణికులను విజయవాడ వెళ్తున్న మరో బస్సులో ఎక్కించి పంపించారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


