రాజమహేంద్రవరం రూరల్: ఎంబీబీఎస్ అడ్మిషన్లలో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 102 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నష్టం కలిగించేలా ఉందని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ అన్నారు. కొంతమూరులో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెరిట్లో మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఓపెన్ కేటగిరిలో కాకుండా రిజర్వేషన్ కేటగిరీలోనే అడ్మిషన్ కోసం ఆప్షన్ పెట్టుకోవాలన్న జీవో అమలైతే ఆయా వర్గాలకు తీవ్ర నష్టం కలుగుతుందని, ఆప్షన్ తప్పనిసరిగా పెట్టుకునే అవకాశం కోల్పోతారని అవేదన వ్యక్తం చేశారు. మెడికల్ రిజర్వేషన్లలోని లోపాల సవరణకు 2019లో రాష్ట్ర హైకోర్టు నియమించిన అరుగురు నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా వచ్చిన జీవో 151 అమలుచేస్తే వారికి న్యాయం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో 102 జీవోను రద్దు చేయాలని ఆయన కోరారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా మాల మహానాడు అధ్యక్షుడుగా గుడాల ప్రసాద్ను, నూతన కమిటీని నియమించారు. ఈ కార్యక్రమలో రాష్ట్ర ఆర్గనైజేషన్ కార్యదర్శి గుండె నగేష్ బాబు, రాష్ట్ర లీగల్ కన్వీనర్ తోర్లపాటి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి, మర్రి శామ్యూల్, కాకినాడ జిల్లా అధ్యక్షులు కాకిలేటి రవీంద్ర, కాకినాడ జిల్లా కార్యదర్శి బక్కి విజయకుమార్, పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి పాలపర్తి కృపానాథ్ తదితరులు పాల్గొన్నారు.


