● వడిశలేరు పాపాయి చెరువులో ఆగని దోపిడీ
● జేసీబీలతో యథేచ్ఛగా తవ్వకాలు
● రూ.లక్షలు చేతులు మారుతున్నా
పట్టించుకోని యంత్రాంగం
● తవ్వకాలను అడ్డుకున్న
వైఎస్సార్ సీపీ నాయకులు
● తహసీల్దారుకు ఫిర్యాదు
● 13 లారీలు, జేసీబీల సీజ్
రంగంపేట: కూటమి సర్కారు కొలువుదీరాక అధికార పార్టీ నాయకుల నేతృత్వంలో సహజ వనరుల దోపిడీ అడ్డూ అదుపు లేకుండా పోతోందని వైఎస్సార్ సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మండలంలోని వడిశలేరు గ్రామంలో పాపాయి చెరువులో మట్టిని అనుమతులు లేకుండా తవ్వేస్తుండడంతో మంగళవారం రాత్రి వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొల్లాటి ఇజ్రాయేలు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ సమయంలో చెరువులో 13 లారీలు, జేసీబీ ఉన్నాయి. వారు తహసీల్దారు కోసు అనసూయకు ఫిర్యాదు చేయడంతో ఆమె ఆదేశాల మేరకు వడిశలేరు వీఆర్వో పోచయ్య అక్రమ మైనింగ్ జరుగుతున్న చెరువు వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితిని సమీక్షించి రికార్డు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న వాహనాల గుర్తించామని 13 లారీలు, జేసీబీని అధికారుల ఆదేశాలతో సీజ్ చేసి తహసీల్దార్ కార్యాలయానికి తరలిస్తున్నామని తెలిపారు. ఇప్పటికై నా మండలంలో మట్టి అక్రమ దోపిడీని అరికట్టాలని వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పోతుల బులి వీర్రాజు, కన్వీనర్ నలమాటి భీముడు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


