గండేపల్లి: కాకినాడ, రాజమహేంద్రవరం విద్యుత్ విజిలెన్స్ అధికారులు ఆయిల్ పామ్ తోటలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేసి ఇద్దరిపై కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే అధికారులకు అందిన సమాచారం మేరకు గోకవరం రోడ్డులో ఉన్న జెడ్ రాగంపేట రెవెన్యూ పరిధి జగ్గంపేటకు చెందిన కోండ్రోతు నారిబాబుకు చెందిన ఆయిల్ పామ్ తోటకు ఆనుకుని వేరొకరి పొలం ఉంది. ఆ పొలంలో బోరుకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలంటే నారిబాబు పొలం మీదుగా లైన్ వెళ్లాల్సి ఉంది. అందుకు నారిబాబు అంగీకరించలేదు. దీంతో విద్యుత్ అధికారులు అతడి విద్యుత్ కనెక్షన్ను కట్ చేశారు. దీంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విద్యుత్ సరఫరా ఇచ్చేందుకు అనుమతించి సుమారు నెల రోజులు గడుస్తున్నప్పటికీ అధికారులు కనక్షన్ ఇవ్వలేదు. ఆయిల్ పామ్ తోట ఎండిపోవడం, పశువుల దాహార్తికి నీళ్లులేకపోవడంపై అధికారులకు ఆన్లైన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పరిశీలనకు వచ్చిన అధికారులు అతని పక్కనున్న పొలంలో రైతులు వారికి సమీపంలోని విద్యుత్ స్తంభం నుంచి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్టు గుర్తించారు. ఈ మేరకు ఇద్దరి రైతులపై కేసు నమోదు చేసినట్టు విద్యుత్ విజిలెన్స్ సీఐ కె.నాగమోహన్రెడ్డి, ఏఈ కె.దుర్గాప్రసాద్ తదితరులు తెలిపారు.


