● వైఎస్సార్ సీపీ నేతలు గన్నవరపు, జిన్నూరి
● వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన
అయినవిల్లి: మొక్కజొన్న, అరటి పంటలకు ప్రభుత్వం గిట్టుబాబు ధర ప్రకటించాలని, తుపాను, అకాల వర్షాలకు దెబ్బతిన్న ఆయా పంటల రైతులను ఆదుకోవాలని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జిన్నూరి రామారావు (బాబి) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని తొత్తరమూడి కె.పెదలంకలో తుపాను, వర్షాలకు దెబ్బతిన్న పంటలను వారు పరిశీలించారు. రైతులు గుత్తాల బాబురావు, రేవు రాంబాబు, బొక్కా సత్యనారాయణ, మద్దా వెంకటలక్ష్మి తదితరులు పాడైన పంటలను వారికి చూపించారు. ఈ ఏడాది మొక్కజొన్న ఎకరాకు 40 బస్తాల వరకు దిగుబడి వచ్చిందని, అరటి సైతం బాగుందని, కానీ మార్కెట్లో గిట్టుబాటు ధర లేక అయినకాడికి విక్రయించాల్సి వస్తోందని వాపోయారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు, రామారావు మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మొక్కజొన్నకు ఎంఎస్పీ క్వింటాలుకు రూ.2400 చెల్లించే వారని ఈ ప్రభుత్వంలో రూ.1400 నుంచి రూ.1700 మాత్రమే చెల్లింస్తున్నారన్నారు. అరటి గెల మార్కెట్లో రూ.400 వరకూ పలికేదని ఇప్పుడు రూ.50కి కూడా కొనావారు లేరన్నారు.
ఇంతలా నష్టపోతున్న రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు చూస్తోందని మండి పడ్డారు. తక్షణం రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి ఆదుకోవాలని కోరారు. పంటల బీమాకు కేంద్ర ప్రభుత్వం, రైతులు ముందుకు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం తమవాటా చెల్లించలేని స్థితిలో ఉందన్నారు. దీంతో బీమా సంస్థలు పంటల బీమాకు ముందుకు రావడం లేదన్నారు. కార్యక్రమంలో అయినవిల్లి, పి.గన్నవరం మండలాల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు మేడిశెట్టి శ్రీనివాసబాబు, యన్నబత్తుల ఆనంద్, రాష్ట్ర రైతు విభాగ జాయింట్ సెక్రటరీ కొర్లపాటి కోటబాబు, రైతు విభాగం మండల అధ్యక్షుడు రెడ్డి గనిరాజు, కోట విజయరాజు, గుత్తుల నాగబాబు, మిండగుడిది శిరీష్ నారాయణస్వామి, కుడుపూడి రామకృష్ణ, మిండగుదిటి రాంబాబు, కుసుమ సునీల్కుమార్, మతుకుమిల్లి సత్తులు తదితరులు ఉన్నారు.


