రామచంద్రపురం రూరల్: బస్సులో బంగారు ఆభరణాల బ్యాగు మరిచిపోయిన వృద్ధురాలికి తిరిగి వాటిని అందజేసి ఆర్టీసీ సిబ్బంది నిబద్ధత చాటుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. రామచంద్రపురం పట్టణ ఆర్టీసీ పాత బస్టాండ్ వద్ద జంగారెడ్డిగూడేనికి చెందిన 60 ఏళ్ల వృద్ధురాలు కాలెపు ప్రభావతి రాజమహేంద్రవరం బస్సు అనుకుని రాజానగరం వెళ్లే బస్సు ఎక్కింది. ఆ బస్సు రాజమహేంద్రవరం వెళ్లదని చెప్పడంతో హడావుడిగా దిగిపోయింది. ఆ హడావుడిలో ఆమె తన బ్యాగును ఆ బస్సులో మర్చిపోయింది. తరువాత గుర్తించిన ఆమె ఆర్టీసీ డిపో మేనేజర్ పేపకాయల భాస్కరరావుకు విషయం తెలియజేయగా, వెంటనే సంబంధిత కండక్టర్, డ్రైవర్లను అధికారులు అప్రమత్తం చేశారు. రూ.6 లక్షల విలువైన ఆభరణాలతో ఉన్న బ్యాగును అధికారుల సమక్షంలో డ్రైవర్, కండక్టర్ల చేతుల మీదుగా ఆమెకు అందజేశారు. కండక్టర్ పలివెల సత్తిబాబు, డ్రైవర్ సీహెచ్ఎస్ రావు, డిపో మేనేజర్లకు ప్రభావతి కృతజ్ఞతలు తెలియజేసింది.


