తాండవ నదిపై పచ్చని తివాచీ కనువిందు చేస్తుంది. ఈ అపురూప దృశ్యం అందరినీ ఆకర్షిస్తోంది. తుని వద్ద జాతీయ రహదారి బ్రిడ్జి నుంచి రైల్వే బ్రిడ్జి వరకూ అర కిలోమీటరు పైగా తాండవ నదిలో పేరుకుపోయిన గుర్రపుడెక్క ఇది. వేసవిలో తాండవ నదిలో నీటి ప్రవాహం నిలిచిపోయి గుర్రపుడెక్క ఇలా పేరుకుపోయింది. వేసవి ఉష్ణోగ్రతలు కొనసాగితే తాండవ నదిలో పూర్తిగా నీరు ఇంకిపోయి ఈ గుర్రపుడెక్క ఎండిపోనుంది. –తుని రూరల్
రక్షణ గోడు పట్టదా!
కాజులూరు మండలం ఉప్పుమిల్లి– దుగ్గుదుర్రు రహదారిలో కాలువపై కల్వర్టు ప్రమాదాలకు నిలయంగా మారింది. పదిహేనేళ్ల కిందట నిర్మించిన వంతెన ఇరువైపులా రక్షణ గోడలు ఏర్పాటు చేయలేదు. ఈ కల్వర్టుకు ఇరువైపులా రోడ్డు మలుపు తిరిగి ఉంటుంది. వేగంగా వచ్చే వాహనాలు అదుపు తప్పితే కాలువలోకి పడిపోతున్నాయి. ఇటీవల ఓ ట్రాక్టర్ కల్వర్టుపై నుంచి కాలువలోకి పడిపోగా, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. –కాజులూరు


