● పశువుల్లో ప్రమాదకరం ● జాగ్రత్తలతో నయం
రాయవరం: మనుషుల మాదిరిగానే పశువులకు కూడా చర్మ వ్యాధులు సోకుతాయి. ఈ చర్మ వ్యాధుల్లో తామర పశువులను అనారోగ్యానికి గురి చేస్తుంది. ఇది ‘డర్మటోఫైట్స్’ అనే రకానికి చెందిన శిలీంధ్రం/బూజు వల్ల ఆవులు, గేదెల్లో కలిగే అతి సాధారణ వ్యాధి. దీనివల్ల చర్మంపై గుండ్రని, గోళాకారపు మచ్చలు ఏర్పడతాయి. దీనినే రింగ్ వార్మ్ అని కూడా అంటారు. పశువులకు తామర వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది?, వ్యాధి లక్షణాలు, చికిత్స విధానాన్ని రాయవరం మండలం మాచవరం పశువైద్యాధికారి ఎం.బిందు వివరించారు. అవి ఇలా..
వ్యాధి వ్యాప్తి.. లక్షణాలు
రింగ్ వార్మ్ ఏడాది లోపు దూడల్లో ముఖ్యంగా ఎండా కాలంలో అధికంగా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పశువుతో కలిసి జీవించే ఇతర పశువులకు నేరుగా, పశువుల కొట్టాంలోని వస్తువుల ద్వారా, పశువుల కాపరుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధికి గురైన పశువుల చర్మంపై ఉండే వెంట్రుకలు రాలిపోతాయి. కంటి చుట్టూ, చెవులు, మెడ, తలపై మరియు గంగడోలు చర్మంపైన ఎర్రటి పుండ్లు ఏర్పడతాయి. ఈ మచ్చలు గుండ్రంగా, గోళాకారంగా ఉండి, గాయం మధ్యలో మానిపోయి చుట్టూ పుచ్చిపోయి ఉంటుంది.
నిర్ధారణ.. చికిత్స
వెంట్రుకలు ఊడిపోయి గుండ్రంగా ఉన్న మచ్చల ఆధారంగా పశువులకు తామర వ్యాధి సోకిందని గుర్తించవచ్చు. చర్మాన్ని సేకరించి పరీక్షించడం ద్వారా వ్యాధిని నిర్ధారించవచ్చు. సాలిసిలిక్, బెంజాయిక్ ఆసిడ్, అయోడిన్, ఫినాల్ వంటి ఔషధాలను దగ్గరలో ఉన్న పశు వైద్యుడిని సంప్రదించిె వినియోగించాలి. తామర తగ్గే వరకూ వైద్యం చేయించాల్సి ఉంటుంది.


