● ఇప్పటి వరకూ రూ.358.31 కోట్ల
మేర విక్రయాలు
● గరిష్ట ధర రూ.265
● సగటు ధర రూ.261.88
దేవరపల్లి: పొగాకు కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. కొనుగోళ్లు ప్రారంభించి దాదాపు 45 రోజులు కావస్తున్నా వేలం కేంద్రాలకు రైతులు బేళ్లు తీసుకురాని పరిస్థితి. ధర గిట్టుబాటు కాకపోవడంతో రైతులు పొగాకు తీసుకురావడానికి అంగీకరించడం లేదు. గత ఏడాది కిలో ప్రారంభ ధర రూ.290 ఉండగా, ఈ ఏడాది రూ.265 మాత్రమే పలకడంతో వారు నిరాశతో ఉన్నారు. ఈ ధరకు పొగాకు అమ్మితే అప్పులు తప్ప మిగిలేదేమీ ఉండదని అంటున్నారు.
జూన్ మొదటి వారం నుంచి మార్కెట్ ఆశాజనకంగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. శనివారం నాటికి టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో రూ.358.31 కోట్ల విలువైన 13.68 లక్షల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి.
కిలోకు గరిష్టంగా రూ.265, కనిష్టంగా రూ.235, సగటున రూ.261.88 చొప్పున ధర లభించింది. 888 బేళ్లు అమ్మకానికి తీసుకురాగా, 216 బేళ్లు తిరస్కరించారు. 672 బేళ్ల కొనుగోలు జరిగినట్టు బోర్డు రీజినల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్ తెలిపారు.
వేలం కేంద్రాల వారీగా కొనుగోళ్ల వివరాలు
వేలం కేంద్రం కొనుగోళ్లు గరిష్ట ధర సగటు ధర
(కిలోలు) (రూ.) (రూ.)
దేవరపల్లి 2,30,706 265.00 263.95
జంగారెడ్డిగూడెం–1 3,65,185 265.00 261.38
జంగారెడ్డిగూడెం–2 2,89,369 265.00 261.98
కొయ్యలగూడెం 2,36,960 265.00 260.62
గోపాలపురం 2,46,022 265.00 261.78


