● జిల్లా కేంద్రంలోని గొడౌన్కు చేరిన సరకు
● మండల కేంద్రాలకు ప్రారంభమైన సరఫరా
రాయవరం: పాఠశాలల పునఃప్రారంభం రోజే పాఠ్య పుస్తకాలు అందించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ మేరకు పాఠ్య పుస్తకం, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను అందించనుంది. ఇప్పటికే జిల్లా పుస్తక గొడౌన్కు చేరుకున్న పాఠ్య పుస్తకాలను జిల్లాల మండల స్టాక్ పాయింట్లకు వాటిని సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ఈ ఏడాది పాఠ్య పుస్తకాలను మరింత కుదిం 53 టైటిల్స్ మాత్రమే ఉండేలా ఏర్పాటు చేసింది. తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లోని మండలాలతో పాటు ఏజెన్సీలోని ఏడు మండలాలకు 18,12,671 పాఠ్య పుస్తకాలు సరఫరా కావాల్సి ఉంది. ఇప్పటికే 80 శాతం అంటే 15,17,441 పాఠ్య పుస్తకాలు జిల్లా గొడౌన్కు చేరుకున్నాయి. ఈ నెల ఏడో తేదీ నుంచి ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా మండల కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లాల వారీగా పంపుతున్న పుస్తకాల వివరాలు ఇలా ఉన్నాయి.
ఉచిత విద్యకు చురుగ్గా ఏర్పాట్లు
● మొదటి విడతగా 3585 మందికి ప్రవేశాలు
● రెండో విడతగా 1,781 సీట్ల కేటాయింపు
రాయవరం: ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు కేటాయించాల్సి ఉంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రానున్న విద్యా సంసత్సరానికి ఇప్పటికే మొదటి విడతగా ఒకటో తరగతిలో 3,585 మంది చిన్నారులకు ఉచిత ప్రవేశాలు కల్పించారు. అలాగే రెండో విడతలో 1,781 మందికి సీట్లు కేటాయిస్తూ అధికారులు ప్రవేశాల జాబితాను విడుదల చేశారు. వారి ప్రవేశాలను ఈ నెల 16వ తేదీలోగా పూర్తి చేయాల్సి ఉంది. విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ఒకటో తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ప్రభుత్వ ఆదేశాలను ఆయా జిల్లాల్లోని ప్రైవేటు, అన్ ఎయిడెడ్ పాఠశాలలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ జి.నాగమణి అధికారులను ఆదేశించారు. అలాగే ఇప్పటికే ఆయా పాఠశాలల యాజమాన్యాలకు ప్రభుత్వ ఆదేశాలపై అవగాహన కల్పించినట్టు తూర్పుగోదావరి సమక్ష శిక్ష జిల్లా ఏపీసీ ఎస్.సుభాషిణి వివరించారు.
జిల్లా పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్స్ డిక్షనరీలు
తూర్పుగోదావరి 3,19,106 53,665 3,495
కోనసీమ 3,70,091 65,223 4,660
కాకినాడ 6,03,802 1,02,549 7,062
పోలవరం 2,24,442 53,297 5,279


