అగ్ని కీలల్లో 100 బస్తాల
ధాన్యం దగ్ధం
రాయవరం: మండలంలోని వెంటూరులో సుమారుగా వంద బస్తాల ధాన్యం అగ్నికి ఆహుతైంది. గ్రామానికి చెందిన బుట్టా వీరబాబు, శ్రీను 10 ఎకరాల పొలంలో కౌలు వ్యవసాయం చేశారు. కోసిన ధాన్యాన్ని పొలంలోనే రాశులుగా వేశారు. వాటి సమీపంలోని ట్రాన్స్ఫార్మర్పై కాకి పడడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. దీంతో కోయగా మిగిలిన వరి గడ్డిపై నిప్పురవ్వలు పడడంతో మంటలు చెలరేగి ధాన్యం రాశులకు అంటుకుంది. రైతులు అప్రమత్తమయ్యే సరికే సుమారుగా వంద బస్తాల ధాన్యం అగ్నికి ఆహుతైనట్లు రైతులు తెలిపారు. సమాచారం అందుకున్న రామచంద్రపురం అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో దాదాపుగా రూ.2 లక్షల వరకు నష్టం వస్తుందని అంచనా వేస్తున్నారు. బాధిత కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్ వాసంశెట్టి రాధాకృష్ణ, పలువురు రైతులు కోరారు.


