తాళ్లరేవు: పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదపడే మడ చెట్లను తొలగించిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎం.నాగార్జున తెలిపారు. మండల పరిధిలోని గాడిమొగ పంచాయతీలో గాయత్రీ సాల్ట్ వర్క్స్ సంస్థకు చెందిన పలువురు రహదారి విస్తరణ నేపథ్యంలో అడ్డుగా ఉన్న మడ చెట్లను విచక్షణా రహితంగా తొలగించారు. ఎటువంటి అనుమతులు లేకుండా మడ చెట్లను తొలగించడంపై పలువురు అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. తుమ్మ చెట్ల ముసుగులో మడ చెట్లను తొలగించడాన్ని గుర్తించి సంస్థ ప్రతినిధులతోపాటు కృష్ణంరాజు అనే వ్యక్తిపై కేసులు నమోదు చేశారు. తీర ప్రాంతానికి రక్షణ కవచంగా ఉన్న మడ అటవీ ప్రాంతంలో చెట్లను తొలగించడం నేరమని, కఠిన చర్యలు చేపట్టనున్నట్లు నాగార్జున విలేకర్లకు తెలిపారు. మడ చెట్లు తొలగించిన ప్రాంతం కోరంగి వైల్డ్లైఫ్ సాంక్చురీకి అతి దగ్గరగా ఉండడం గమనార్హం.


