సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): పట్టుదలతో కష్టపడితే జీవితంలో సాధించలేనిదేదీ లేదని కలెక్టర్ కలెక్టర్ కీర్తి అన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 27 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను మంగళవారం కలెక్టరేట్లో ఆమె అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ, తన చిన్ననాటి అనుభవాలను పంచుకున్నారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించడం ద్వారా ఉన్నత లక్ష్యాలను చేరుకునే ధైర్యం పెరుగుతుందని అన్నారు. ప్రయత్నించడం మాత్రమే మన చేతుల్లో ఉంటుందని, ఫలితాలపై ఆందోళన చెందకుండా నిరంతరం కృషి చేస్తే విజయాలు వాటంతట అవే వస్తాయని అన్నారు. పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ముఖ్యంగా బాలికల విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, చిన్న వయసులో వివాహాలు చేయరాదని తల్లిదండ్రులకు కలెక్టర్ సూచించారు. జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ కూడా ప్రసంగించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ క్షితిజ్ ఆదిత్య శర్మ, నగర పాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, జిల్లా విద్యా శాఖాధికారి కె.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.


