● దేవినేనివారిగూడెంలో ఘటన ● లబోదిబోమంటున్న రైతులు
ద్వారకాతిరుమల: మండలంలోని దేవినేనివారిగూడెంలో పలు వ్యవసాయ భూముల్లో కొందరు మోటారు కేబుల్ వైర్ల దొంగలు ఆదివారం అర్ధరాత్రి రెచ్చిపోయారు. దాదాపు 20 మంది రైతులకు చెందిన పొలాల్లోని బోర్ల మోటార్లకు ఉన్న విద్యుత్ కేబుల్ వైర్లను చోరీ చేశారు. వివరాల్లోకి వెళితే. దేవినేనివారిగూడెంకు చెందిన రైతులు కమ్మ వెంకట సుబ్రహ్మణ్యం, ముళ్ళపూడి శ్రీరామమూర్తి, నల్లూరి యుగంధర్, కమ్మ నాగన్న, ముళ్ళపూడి రామ్మోహనరావు తదితరులకు చెందిన వ్యవసాయ భూముల్లోకి దొంగలు ప్రవేశించారు. కాపర్ వైర్ల కోసం బోర్లుకు ఉన్న మోటారు వైర్లను కట్ చేసి, చోరీ చేశారు. సోమవారం తెల్లవారుజామున పొలాలకు వెళ్లిన బాధిత రైతులు ఈ చోరీలను గుర్తించి లబోదిబోమన్నారు. ఒక్క రాత్రిలో ఇంతమంది రైతుల పొలాల్లో విద్యుత్ కేబుల్ వైర్లు చోరీలు జరగడం స్థానిక రైతులను ఉలిక్కిపాటుకు గురిచేసింది. బాధిత రైతులు ఫిర్యాదులు చేసేందుకు సమాయత్తమవుతున్నారు.


