దేవరపల్లి: కూటమి ప్రభుత్వ సాంకేతిక తప్పిదాలకు ప్రభుత్వ పథకాలు అందక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. మీ తప్పిదాన్ని మీరే సరిచేయండని మొత్తుకుంటుంటే ఆ అధికారం తమకు లేదని సదరు అధికారులు నీళ్లు నములుతున్నారు. వివరాల్లోకి వెళితే మండలం త్యాజంపూడికి చెందిన కూలీ కోడ్రు మధు ప్రసాద్కు ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె వినూత్న 7, రెండో కుమార్తె స్వర్ణ 8వ తరగతి ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఏటా అమ్మఒడి పథకం వర్తించేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత పథకం సొమ్ము వారి తల్లి ఖాతాకు పడలేదు. దీంతో మధుప్రసాద్ నాలుగు నెలలుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరగగా చివరికి అతని పేరుపై 29 ఎకరాల భూమి ఉందని అందువల్ల పథకం నిలిచిపోయినట్టు తెలిసింది. తనకు కేవలం 47 సెంట్ల భూమి మాత్రమే ఉందని చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో అతడు మండలం మొదలుకుని కలెక్టర్ కార్యాలయం వరకు తనకు న్యాయం చేయాలని అర్జీ పెట్టుకున్నాడు. దీనిపై అధికారులు ఆరా తీయగా గ్రామంలోని కంసాలి చెరువు, ఊర చెరువు, పలకుంట చెరువు, రామచెరువు (ఎల్పీ నంబర్ 105, 353, 462, 461) మొత్తం 29 ఎకరాలు అతని ఆధార్ కార్డుకు లింకై నట్టు వెబ్ల్యాండ్ రికార్డుల్లో చూపారు. దీంతో అతడి కుటుంబం అవాకై ్కంది. దీంతో అతడు తన రికార్డుల నుంచి ఆ చెరువులను తొలగించి వచ్చే నెలలో వచ్చే తల్లికి వందనం పథకాన్ని అందించాలని కోరాడు. పిల్లలను ప్రైవేటు స్కూళ్లలో చదివించలేక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించనునట్టు తెలిపాడు. గత నెల 28న కలెక్టర్ను కలిసి సమస్య పరిష్కరించాలని కోరామని, లేకుంటే వారం రోజుల్లో తహసీల్దార్ కార్యాలయం వద్ద కుటుంబంతో దీక్ష చేపడతామని పేర్కొన్నాడు. సమస్య పరిష్కారం కాకుంటే ఆ 29 ఎకరాల చెరువులను తనకు అప్పగించాలని కోరాడు. దీనిపై తహసీల్దార్ ఎం. శ్రీనివాస్ను వివరణ కోరగా, వెబ్లాండ్ రికార్డుల నుంచి తొలగించే ఆప్షన్ తన లాగిన్లో లేదని, వచ్చిన వెంటనే తొలగిస్తామని తెలిపారు.
నిరుపేద ఆధార్కు 29 ఎకరాల్లోని
చెరువులు లింకింగ్
వెబ్ల్యాండ్లో నమోదుతో
పిల్లలకు అందని విద్యా పథకం
లింక్ తొలగించే లాగిన్ తనకు లేదన్న తహసీల్దార్
రెండేళ్లుగా తల్లి ఖాతాకు జమకాని నిధులు


