మామిడికుదురు: వైనతేయ గోదావరి నదీ తీరంలోని లంక గ్రామాల రైతులు సుదీర్ఘ కాలం నుంచి సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. సారవంతమైన భూములకు సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భం నుంచి వచ్చే జలాలు ఉప్పు నీటిమయంగా మారడం కలవరపెడుతోంది. ఉప్పు నీటి ప్రభావంతో కొబ్బరి కాయల దిగుబడులు గణనీయంగా పడిపోతోంది. రూ.వేలు ఖర్చు చేసి ఏటా వేసవిలో రైతులు కొబ్బరి తోటలకు నీటి తడులు పెడుతున్నారు. దీని కోసం ఎన్నో వ్యయ ప్రయాసలు పడాల్సిన పరిస్థితి వస్తోంది. పాలకులు మారుతున్నా లంక గ్రామాలకు సాగునీరందించే అప్పనపల్లి ఎత్తిపోతల పథకానికి మోక్షం లభించడం లేదని రైతులు మండిపడుతున్నారు. అప్పనపల్లి, పెదపట్నంలంక, పెదపట్నం, బి.దొడ్డవరం, మానేపల్లి గ్రామాలకు అప్పనపల్లి ఎత్తిపోతల పథకం ఎంతో అవసరం. చుట్టూ పుష్కలంగా గోదావరి జలాలు అందుబాటులో ఉన్నా, ఆ జలాలు ఉప్పు నీటిమయం కావడంతో ఇక్కట్లు తప్పడం లేదు. ఐదు గ్రామాల్లో 15 కిలోమీటర్ల పంట కాలువ ఏర్పాటుతో 4,035 ఎకరాల్లోని కొబ్బరి తోటలకు ప్రయోజనం కలుగుతుంది. దీంతో పాటు కొబ్బరి తోటల్లో అంతర పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. బ్రిటీష్ వారి హయాంలో పైగ్రామాలకు ఇరిగేషన్ సదుపాయం ఉండేది. ప్రస్తుతం ఈ గ్రామాలకు ఇరిగేషన్ సదుపాయం లేక ఆ గ్రామాల రైతులు బోరు బావులపై ఆధారపడి కొబ్బరి సాగు చేస్తున్నారు. అప్పనపల్లి ఎత్తిపోతల పథకం కార్యరూపం దాల్చితే ఎంతో మేలు జరుగుతుంది.
ఫ అప్పనపల్లి ఎత్తిపోతల
పథకానికి కానరాని మోక్షం
ఫ తీరంలో లంక భూములకు
అందని నీరు


