కోరుకొండ: సంపదను కొల్లగొట్టడంలో అక్రమార్కుల ‘కూటమి’ది అందె వేసిన చెయ్యి అనే విమర్శలు వస్తున్నాయి. వారు చెట్లకు సైతం డబ్బులు కాయిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో చెట్లు కనిపిస్తే చాలు.. వెంటనే వేటు వేసి, ఆ కలపను అక్రమంగా తరలించేసి, సొమ్ము చేసుకుంటున్నారు. కోరుకొండ మండలం బూరుగుపూడి మీదుగా గుమ్ములూరు, బుచ్చెంపేట వైపు పుష్కర సబ్ కెనాల్ ఉంది. దీనిపై బూరుగుపూడి వద్ద సుమారు 3 కిలోమీటర్ల మేర వేప, నిద్రగన్నేరు, కంచి, తుమ్మ తదితర విలువైన చెట్లున్నాయి. వీటిని నియోజకవర్గంలోని ఓ ముఖ్య నాయకుడి అండతో కొంతమంది అక్రమార్కులు అడ్డగోలుగా నరికేసి, అక్రమంగా తరలించుకుపోయారు. అలాగే, మత్స్య సహకార సంఘం చేపలు పెంచుతున్న చెరువు గట్లపై చెట్లను సైతం నరికేశారు. అది గమనించిన స్థానిక నాయకులు వారిని అడ్డుకున్నారు. చెట్లు నరికివేస్తున్న వారితో పాటు నరికివేతకు వారు ఉపయోగిస్తున్న సామగ్రిని బూరుగుపూడి పంచాయతీ అధికారులకు అప్పగించారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి కేసు నమోదు చేయడానికి సిద్ధం కాగా, స్థానిక కూటమి నాయకుడు తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తెచ్చాడని తెలుస్తోంది. గతంలో స్థానిక ఆవభూమిలో 361 ఎకరాల విస్తీర్ణంలో జామాయిల్ చెట్లు నరికేసిన అక్రమార్కులే, పుష్కర కాలువపై కూడా చెట్లు నరికేశారని అంటున్నారు. వీరిపై అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.


