శంఖవరం: కత్తిపూడి– రౌతులపూడి రోడ్డులో సోమవారం జరిగిన ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం.. స్థానిక జెడ్పీ హైస్కూల్ శివారులో కత్తిపూడి సీతారామా కళాశాల బస్సు విద్యార్థులతో శృంగవరం వెళ్తుండగా, రౌతులపూడి నుంచి వస్తున్న గ్రావెల్ లారీ బలంగా ఢీకొంది. బస్సులో ప్రయాణిస్తున్న శంఖవరం మండలం గౌరంపేట పంచాయతీ మాసంపల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థినులు టి.సంధ్య అనురాధ, డి.వరలక్ష్మి, శృంగవరం గ్రామానికి చెందిన స్థానిక జెడ్పీ హైస్కూల్ విద్యార్థి వై.అభిరామ్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక పీహెచ్సీకి తరలించారు. ఈ రోడ్డులో అధిక బరువుతో గ్రావెల్ లారీలు తిరగడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


