సామర్లకోట: తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వేంచేసి యున్న శృంగార వల్లభ స్వామి వారి కల్యాణోత్సవం ఆదివారం నేత్రపర్వంగా జరిగింది. ఏటా చైత్ర శుద్ధ ఏకాదశి పర్వదినాన ఇక్కడ స్వామి వారి కల్యాణం నిర్వహిస్తారు. ఆలయంలో సర్వాంగసుందరంగా అలంకరించిన వేదికపై రాత్రి 10 గంటలకు అర్చకులు కల్యాణ క్రతువుకు శ్రీకారం చుట్టారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధారణ, మహాసంకల్పం, సుముహూర్తం, మాంగల్యసూత్ర ధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి వేలాదిగా వచ్చిన భక్తులు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో జరిగిన స్వామివారి కల్యాణోత్సవాన్ని కన్నులారా తిలకించి పులకించిపోయారు. అర్ధరాత్రి 12 గంటల వరకూ కల్యాణం కన్నుల పండువగా సాగింది. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ చైర్పర్సన్ మొయిళ్ల సంధ్యా కృష్ణమూర్తి, ఈఓ వడ్డీ శ్రీనివాసరావుల ఆధ్వర్యాన కల్యాణానికి ఏర్పాట్లు చేశారు.


