సౌరయాగం ప్రారంభం
తాళ్లపూడి: మండలంలోని ప్రక్కిలంక శివాలయంలో లోక కల్యాణార్థం శశిశేఖర మిత్ర బృందం ఆధ్వర్యంలో 17వ సౌరయాగం పూజలను బుధవారం ప్రారంభించారు. అర్చకుడు కౌతవరపు విశ్వనాథశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి మహాగణపతి పూజ, సర్వదేవతా ఆరాధన, గోపూజ, అగ్ని ప్రతిష్ఠాపన, సౌరజపం, సూర్య నమస్కారాలు, సౌర హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యుడు ఆరోగ్య ప్రదాత, ప్రత్యక్ష కర్మ సాక్షి అని, సూర్యారాధనతో సకల గ్రహ బాధలు తొలగుతాయన్నారు. మాఘ మాసంలో నెల రోజుల పాటు ఈ పూజలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు జిల్లా మీదుగా పలు రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ శుక్రవారం చర్లపల్లి – కాకినాడ టౌన్ (07491), 24వ తేదీ శనివారం కాకినాడ టౌన్ – తిరుపతి (07493), 25వ తేదీ ఆదివారం తిరుపతి – కాకినాడ టౌన్ (07494), 26వ తేదీ సోమవారం కాకినాడ టౌన్ – చర్లపల్లి (07492) మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయని రైల్వే అధికారులు ప్రకటించారు. రాజమహేంద్రవరం, ద్వారపూడి, సామర్లకోట జంక్షన్, కాకినాడ రైల్వేస్టేషన్లలో ఇవి ఆగుతాయని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పేదరిక నిర్మూలనకు
కృషి చేయాలి
రాజమహేంద్రవరం సిటీ: జాతీయ భావనను గ్రామాల స్థాయికి తీసుకువెళుతూ పేదరిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపు నిచ్చారు. రాజమహేంద్రవరం వచ్చిన ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. వికసిత్ భారత్ను విస్తరించాలని, మహిళా అభ్యున్నతి, దేశ అభివృద్ధికి ఎంతో అవసరమన్నారు. మనమంతా తెలుగు భాషను గౌరవించాలన్నారు. రాజమహేంద్రవరంతోనూ, ఇక్కడ నేతలతో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. గవర్నర్లు, ముఖ్యమంత్రులు సయోధ్యతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
సౌరయాగం ప్రారంభం


