
వెలుగు..బంద్
● వెలుగుబంద జగనన్న కాలనీపై
కూటమి సర్కారు నిర్లక్ష్యం
● జిల్లాలోనే అతి పెద్ద లే అవుట్
● ఒకేచోట 13,069 కుటుంబాలకు ఆవాసం కల్పించేలా గత
వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కృషి
● కూటమి ప్రభుత్వ హయాంలో
గృహ నిర్మాణాలపై నిర్లక్ష్యం
● లే అవుట్లో రాజ్యమేలుతున్న సమస్యలు
● తాగునీటికి ఇబ్బందులు
● అధ్వానంగా రోడ్లు
● వెలగని వీధి దీపాలు
సాక్షి, రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వ కక్ష పూరిత చర్యలతో నిరుపేదల సొంతింటి కల సాకారమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. గత ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు దూరం చేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం గృహ నిర్మాణాలపై నిర్లక్ష్యం చూపుతోంది. జగనన్న కాలనీల్లో ఇదివరకే వసతులున్నా.. వాటిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఫలితంగా ఆయా కాలనీల్లో ఇళ్లు కట్టుకునేందుకు లబ్ధిదారులు ముందుకు రావడం లేదు. దీనికి జిల్లాలోనే అతి పెద్దదైన వెలుగుబంద లే అవుటే నిదర్శనంగా నిలుస్తోంది. రాజానగరం నియోజకవర్గం వెలుగుబందలోని జనన్న కాలనీలో నెలకొన్న సమస్యలపై ‘సాక్షి’ గౌండ్ రిపోర్ట్..
13,069 కుటుంబాలకు ఆవాసం
జిల్లావ్యాప్తంగా 71,523 గృహ నిర్మాణాలకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో వెలుగుబంద లే అవుట్లో అత్యధికంగా 13,069 కుటుంబాలకు ఆవాసం కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. తొలి దశలో 9,845 మందికి పట్టాలు అందజేశారు. మరో 3,224 మందికి రెండో దశలో పట్టాలు ఇచ్చారు. తొలి దశలోనే ప్రతిష్టాత్మకంగా 6,156 గృహ నిర్మాణాలు ప్రారంభించారు. పనులు చురుకుగా నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలోనే 150 కుటుంబాల వారు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని గృహప్రవేశాలు సైతం చేశారు.
న్యాయపరమైన చిక్కులు అధిగమించి..
వెలుగుబంద లే అవుట్లో పట్టాలు ఇవ్వ రాదంటూ అప్పట్లో కొందరు న్యా యస్థానాన్ని ఆశ్రయించారు. ఫలితంగా అర్హులైనప్పటికీ 2,578 మందికి పట్టాలు అందలేదు. ఈ నేపథ్యంలో గత ప్రభు త్వం పేదల అవస్థలను కో ర్టు దృష్టికి తీసుకెళ్లి, సమస్య పరిష్కరించి మరీ పట్టాలు పంపిణీ చేసింది.
సమస్యల తిష్ట
గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలుగుబంద లే అవుట్ను పట్టించుకున్న దాఖలాలు లేవు. వాస్తవానికి ఈ కాలనీలో గత ప్రభుత్వ హయాంలోనే అన్ని వసతులూ కల్పించారు. కానీ, వాటి నిర్వహణను ప్రస్తుత ప్రభుత్వం విస్మరించడంతో లే అవుట్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. దీనిపై ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచని స్థితిలో కాలనీవాసులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు తమ బాధలు విన్నవించినా.. నేటికీ పట్టించుకున్న దాఖలాలు లేవు.
● కాలనీలో 150 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. వారి సౌకర్యార్థం గత ప్రభుత్వ హయాంలో తాగునీటి కుళాయిలు, నీటి ట్యాంకులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిని పట్టించుకునే వారే కరువయ్యారు. తాగునీటి పైప్లైన్లకు లీకేజీలు ఏర్పడి నీరు వృథా అవుతున్నా బాగు చేసే నాథుడే లేడు. దీంతో, కుళాయిలున్నా తాగడానికి గుక్కెడు నీరు కూడా రావడం లేదు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నుంచి వచ్చే తాగునీటి ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోందని ఇక్కడి కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. నివాసం ఉంటున్న ఇళ్ల కుళాయిలకు నీళ్లు రావడం లేదని.. ఖాళీగా ఉన్న ఇళ్లకు మాత్రం నీటి సరఫరా జరగడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు.
● కాలనీలోకి వెళ్లే ప్రధాన, అంతర్గత రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ఎక్కడికక్కడ గోతులు పడ్డాయి. వాటిలో వర్షపు నీరు నిలిచిపోయి ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
● కాలనీలో కొన్ని విద్యుత్ స్తంభాలకు వీధి దీపాలు ఏర్పాటు చేయలేదు. ఉన్నవి సైతం వెలగడం లేదు. రాత్రయితే అంధకారంలో మగ్గిపోతూ, బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి. చీకటిగా ఉండటంతో కొంతమంది ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు.
● కాలనీవాసులకు విద్యుత్ సమస్య తలెత్తకూడదనే సదుద్దేశంతో గత ప్రభుత్వం వీధికో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసింది. అయితే, గృహ నిర్మాణాలు పూర్తవలేదనే సాకుతో ఏపీ ఈపీడీసీఎల్ అధికారులు ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తిరిగి తీసుకెళ్లిపోయారు. దీంతో లో ఓల్టేజీ సమస్య తతెత్తుతోంది. టీవీ, ఫ్రిజ్, మిక్సీ వంటి పరికరాలు కాలిపోతున్నాయి. గృహ నిర్మాణం పూర్తి చేసుకుని, విద్యుత్ కనెక్షన్ పొందాలనుకునే వారికి ఇబ్బందులు తప్పడం లేదు.
● లే అవుట్ మొత్తం పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. అవి విషసర్పాలకు ఆలవాలంగా మారాయి. ఎప్పుడు ఎవరిని కాటేస్తాయోనని ఇక్కడ నివసిస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు.
3,330 పట్టాల రద్దు!
వెలుగుబంద జగనన్న కాలనీలో మొత్తం 13,069 కుటుంబాలకు గాను 11,771 గృహ నిర్మాణాలకు అనుమతులు మంజూరయ్యాయి. 8,441 ఇళ్ల నిర్మాణాలు వివిధ స్థాయిల్లో పురోగతిలో ఉన్నాయి. గృహ నిర్మాణాలు ప్రారంభించలేదనే సాకుతో ఈ ఒక్క లే అవుట్లోనే 3,330 పట్టాల రద్దుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.

వెలుగు..బంద్

వెలుగు..బంద్