● రాష్ట్ర జీవీవీ ప్రధాన కార్యదర్శి సురేష్
● ముగిసిన రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులు
అమలాపురం టౌన్: సైద్ధాంతిక పునాదులపైనే జన విజ్ఞాన వేదిక (జేవీవీ) నాడు.. నేడు.. ఎప్పుడూ ప్రయాణిస్తుందని, ఆ లక్ష్యంతోనే పనిచేస్తుందని జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తువ్వా సురేష్ స్పష్టం చేశారు. స్థానిక యూటీఎఫ్ హోమ్లో రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిశాయి. ఈ తరగతులను జేవీవీ జిల్లా అధ్యక్షుడు జె.సత్యనారాయణ ప్రారంభించారు. రాష్ట్రంలోని వివి ధ జిల్లాల నుంచి వచ్చిన సంస్థ ప్రతినిధులు జిల్లాల వారీగా నివేదికలు సమర్పించారు. సంస్థ జిల్లా గౌరవాధ్యక్షుడు, రాష్ట్ర శిక్షణ తరగతుల నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం, మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జేవీవీ పోరాటం మనుషుల మీద, వారి వ్యక్తిగత విశ్వాసాలపై కానే కాదని, మనుషుల మూఢ నమ్మకాలపైనేనని చెప్పారు. తరగతుల్లో పాల్గొన్న అమలాపురం వీజీఎస్ అధినేత శిరం రామారావు మాట్లాడుతూ చెకుముకి సైన్స్ సంబరాలకు ఎప్పటిలాగే తన వంతు సహకారం ఉంటుందని ప్రకటించారు. జేవీవీ రాష్ట్ర నాయకుడు కేఎంఆర్ ప్రసాద్, జి.మురళీధర్, గిరిధర్, జీవీహెచ్పీ వర్మ, రాష్ట్ర సమతా కన్వీనర్ ఎంకేపీ వాణి, జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీవీవీ వరప్రసాద్ సంస్థ సిద్ధాంతాలను వివరించారు. సంస్థ రాష్ట్ర కోశాధికారి మురళీధర్ ‘ఆర్థిక క్రమశిక్షణ –నిర్వహణ సమస్యలు’ అనే అంశంపై విశ్లేషణ చేశారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంటీవీ సుబ్బారావు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు బీఎన్ వెంకటేశ్వరరావు, బి.శివకుమార్, ఖాజా మొహినుద్దీన్ పాల్గొన్నారు.


