మామిడికుదురు: అప్పనపల్లిలోని శ్రీబాల బాలాజీ స్వామివారిని దర్శించుకున్న భక్తుల మది పులకించింది. శనివారం కావడంతో స్వామివారి ఆలయం కిక్కిరిసింది. తెల్లవారు జామున సుప్రభాత సేవను అర్చకులు వైభవంగా జరిపించారు. అనంతరం తొలి హారతి కనుల పండువలా జరిపించారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం తలనీలాలు సమర్పించారు. ముడుపులు, మొక్కుబడులు చెల్లించారు. నిత్యాన్నదాన పథకానికి విజయవాడకు చెందిన మాగంగి గోవిందరాజులు, సాయిలక్ష్మి దంపతులు రూ.10,116, కై కలూరుకు చెందిన సాయింకూరి శ్రీరామకృష్ణ, పుష్పసాయి దంపతులు రూ.10,116 విరాళాలుగా సమర్పించారు. కాగా ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.4,04,987 ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ ఎం.రాంబాబురెడ్డి తెలిపారు. మొత్తం 6,800 మంది భక్తులు దర్శించుకోగా, 3,100 మంది అన్న ప్రసాదం స్వీకరించారు. నిత్యాన్న ప్రసాద ట్రస్టుకు రూ.1,41,136 విరాళాలుగా వచ్చాయి.
వీరేశ్వరుని హుండీ
ఆదాయం రూ.13 లక్షలు
ఐ.పోలవరం: మురమళ్లలోని వీరేశ్వరస్వామి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని శనివారం లెక్కించారు. ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్, ఈఓ వి.సత్యనారాయణ, తనిఖీ అధికారి జె.రామలింగేశ్వరరావు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. 138 రోజులకు గాను ఆలయ ప్రధాన హుండీ ద్వారా రూ.13,11,858, అన్నదాన హుండీ ద్వారా రూ.43,131 కలిపి రూ.13,54,989 ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో జమ చేస్తామన్నారు. కార్యక్రమంలో ధర్మకర్త మండలి సభ్యులు, భక్తులు, సత్యసాయి సేవకులు తదితరులు పాల్గొన్నారు.
రేపటి పీజీఆర్ఎస్ రద్దు
బోట్క్లబ్ (కాకినాడ సిటీ): కలెక్టరేట్లో నిర్వహించే జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవిన్యూ క్లినిక్ కార్యక్రమాలను అనివార్య కారణాలతో ఈ సోమవారం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ షణ్మోహన్ శనివారం తెలిపారు. తమ సమస్యలు పరిష్కారానికి ప్రజలు 1100 కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.


