అమలాపురం టౌన్: భూమి, ఉపాధి, సామాజిక న్యాయం లక్ష్యాలుగా పోరాడుతున్న ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ 30వ రాష్ట్ర మహాసభలు మే 6, 7, 8 తేదీల్లో అమలాపురంలో నిర్వహించనున్నట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు వెల్లడించారు.
స్థానిక యూటీఎఫ్ హోమ్లో శనివారం జిల్లా సంఘ సమావేశం జరిగింది. రాష్ట్ర మహా సభల నిర్వహణ కోసం ఆహ్వాన సంఘాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర మహా సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మహా సభల ప్రాముఖ్యతను వివరించారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు ఆ సభల మూడు రోజుల షెడ్యూల్ను వివరించారు.
రాష్ట్ర మహా సభలకు ఆహ్వాన కమిటీ గౌరవాధ్యక్షుడిగా రవణం వేణుగోపాలరావు, అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథిగా ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి, ప్రధాన కార్యదర్శిగా కారెం వెంకటేశ్వరరావు, కోశాధికారిగా కె.శంకర్కుమార్తో పాటు రాష్ట్ర సభలకు పేట్రన్లుగా పది మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల జిల్లా నాయకులు పాల్గొన్నారు.


