భార్‌మంటూ.. | - | Sakshi
Sakshi News home page

భార్‌మంటూ..

Aug 31 2025 12:47 AM | Updated on Aug 31 2025 9:49 AM

భార్‌

భార్‌మంటూ..

టెండర్లు వేసేందుకువ్యాపారుల విముఖత

 జిల్లాలో 11 బార్లకు ఒకటే ఖరారు

అదీ టీడీపీ అనుకూల సిండికేట్‌కే..

టెండర్‌ ధరావతు తగ్గించేలా పన్నాగం

సాక్షి, అమలాపురం: మద్యం సిండికేట్‌ వ్యూహం ఫలించింది.. బార్ల లైసెన్స్‌ కోసం నిర్వహించిన టెండర్లకు విధించిన ధరావతును తగ్గించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కూటమి అనుకూల మద్యం సిండికేట్‌దారులు టెండర్ల డ్రామాను రక్తి కట్టించారు. జిల్లాలో మొత్తం 11 బార్లకు సంబంధించి శనివారం నిర్వహించిన టెండర్లలో కేవలం ఒకే ఒక బార్‌కు సంబంధించి మాత్రమే టెండరు ఖరారైంది. మిగిలిన వాటికి నిబంధనల మేరకు టెండర్లు పడకపోవడంతో వాటిని రద్దు చేశారు. జిల్లా పరిధిలో మొత్తం 11 బార్ల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో తొమ్మిది జనరల్‌ కాగా, రెండు కల్లు గీత కార్మికులకు కేటాయించింది.

 లైసెన్స్‌ ఫీజు రూ.20 లక్షలు కాగా, టెండర్‌కు ధరావతు రూ.5.10 లక్షల చొప్పున నిర్ణయించింది. ఒక్కో బార్‌కు కనీసం నాలుగురైనా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది. అప్పుడు ఆయా బార్లకు టెండర్లు తెరుస్తారు. నలుగురిలో ఒకరిని లాటరీ విధానంలో ఎంపిక చేస్తారు. అంటే సిండికేట్‌ మీద బార్‌ లైసెన్స్‌ పొందాలంటే కనిష్ఠంగా నాలుగు దరఖాస్తులకు రూ.20.40 లక్షల వరకూ అవుతోందని, ఒకరిపై లైసెన్స్‌ పొందితే మిగిలిన రూ.15.30 లక్షలు నష్టపోతామని సిండికేట్‌ వ్యాపారుల ఆలోచన. దీనిని సాకుగా చూపించి కూటమి అనుకూల మద్యం సిండికేట్‌దారులు టెండర్లు వేయకపోవడంతో పాటు టెండరు వేసేందుకు ముందుకు వచ్చిన వారిని అడ్డుకోవడం గమనార్హం. దీంతో జిల్లాలో 11 బార్లకు గాను కేవలం ఒకటంటే ఒక బార్‌కు మాత్రమే టెండరు ఖరారైంది. అది కూడా అమలాపురం పట్టణ పరిధిలోని బార్‌ కావడం, అదీ టీడీపీ అనుకూలదారులే కావడం విశేషం.

మామూళ్ల భారమూ ఎక్కువే?

మద్యం షాపులు.. బార్ల నిర్వాహకులకు మామూళ్లు తలకు మించిన భారంగా మారుతోంది. ఇటు నాయకులు, అటు అధికారులు టార్గెట్‌లు పెట్టి మరీ వసూలు చేస్తున్నారు. నాయకులు నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల చొప్పున మామూళ్లు వసూలు చేస్తున్నారు. మరోవైపు ఎకై ్సజ్‌ అధికారులు సైతం షాపునకు వచ్చి రూ.30 వేల నుంచి రూ.50 వేల చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గత నెలలో మద్యం సిండికేట్‌ ఒక రోజు దుకాణాలు మూసి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఎకై ్సజ్‌ కార్యాలయం వద్దకు వెళ్లి మద్యం దుకాణాల తాళాలు అధికారులకు ఇచ్చి వారిపై ఆరోపణలు గుప్పించారు. ఇది రాష్ట్ర స్థాయిలో సంచలనమైంది. ఇప్పుడు బార్ల లైసెన్స్‌కు మద్యం వ్యాపారులు దూరంగా ఉండటానికి ఈ మామూళ్లు కూడా ఒక కారణమని తెలుస్తోంది. ఏదేమైనా మొత్తం సిండికేట్‌గా సాగుతున్నారు.

ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ బదిలీ

అమలాపురం టౌన్‌: జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎస్‌డీవీ ప్రసాద్‌ ఆకస్మికంగా బదిలీ అయ్యారు. విజయవాడ ఎక్సైజ్‌ కమిషనర్‌ కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆయనకు శనివారం సాయంత్రం ఆదేశాలు వచ్చాయి. జిల్లాలో శుక్రవారం జరిగిన 11 బార్లకు దరఖాస్తుల విషయంలో చోటుచేసుకున్న వైఫల్య ప్రభావం ఆయనపై పడినట్లు తెలుస్తోంది. జిల్లాకు మంజూరైన 11 బార్లకు సంబంధించి అమలాపురంలో ఒకే ఒక బార్‌కు 4 దరఖాస్తులు వేయడం మినహా మిగిలిన 10 బార్లకు దరఖాస్తులు రాని విషయం విధితమే. ఏడాది కిందటే అమలాపురంలోని జిల్లా ఎకై ్సజ్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా ప్రసాద్‌ బాధ్యతలు చేపట్టారు.

వాయిదా పడితేనే..

బార్లకు నిర్వహించే టెండర్ల ప్రక్రియ ఒకటి రెండుసార్లు ఇలా వాయిదా పడితేకాని ప్రభుత్వం దారికి రాదనే అంచనాతో మద్యం వ్యాపారులు ఉన్నారు. ముమ్మిడివరం, అమలాపురంలో కూటమి పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులు నేరుగా మద్యం వ్యాపారంలో భాగస్వాములుగా ఉండగా, మిగిలిన వారికి సిండికేట్‌తో ఒప్పందాలు ఉన్నాయి. వీరి అండతోనే మద్యం వ్యాపారులు ప్రభుత్వ విధానాలను కూడా కోనసీమ జిల్లా వరకూ తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆ నమ్మకంతోనే బార్ల లైసెన్స్‌ అనుమతులకు టెండర్లు వేయకుండా ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

భార్‌మంటూ..1
1/2

భార్‌మంటూ..

భార్‌మంటూ..2
2/2

భార్‌మంటూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement