తల్లికి వంచన | - | Sakshi
Sakshi News home page

తల్లికి వంచన

Jun 15 2025 8:19 AM | Updated on Jun 15 2025 8:19 AM

తల్లి

తల్లికి వంచన

ఆదివారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2025

తల్లికి వందనానికి ని‘బంధనాలు’

జిల్లాలో సుమారు 2.40 లక్షల

మంది విద్యార్థులు

పథకం వర్తించిన వారు 1,70,869 మంది

69,131 మందికి కోత

గత ఏడాది బకాయిల ఊసెత్తని సర్కార్‌

సాక్షి, అమలాపురం: తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ఏడాది విజయవంతంగా ఎగ్గొట్టారు. రెండో ఏడాది ఇచ్చినట్టే ఇచ్చి.. నిబంధనల పేరుతో లబ్ధిదారుల్లో భారీగా కోత పెట్టారు. రానివారు కంగారు పడవద్దని, ఇంకా సమయం ఉందని, అవకాశం ఇస్తామని అధికారులు చెబుతున్నా.. నిబంధనలు చూస్తూంటే చాలా మందికి తల్లికి వందనం అందే పరిస్థితి కనిపించడం లేదు.

జిల్లాలో ఇలా..

జిల్లావ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకూ ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో సుమారు 2.40 లక్షల మంది విద్యార్థులున్నారు. తల్లికి వందనం కింద వీరిలో 1,70,869 మంది విద్యార్థులకు సంబంధించి 1,12,419 మంది తల్లుల ఖాతాల్లో రూ.250 కోట్లు జమ చేశారు. రకరకాల సాకులతో మిగిలిన 69,131 మందికి ఈ పథకాన్ని వర్తింపజేయలేదు. ప్రభుత్వం విధించిన పలు నిబంధనలతో చాలా మంది అనర్హులుగా మారారని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే చదువుకుంటున్న ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం అమలు చేస్తామని ప్రతి ఎన్నికల సభలోనూ చంద్రబాబు, కూటమి నేతలు ఊదరగొట్టారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అమ్మ ఒడి పేరుతో ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఆ ప్రభుత్వ హయాంలో ఈ పథకం కింద జిల్లాలోని తల్లులకు నాలుగేళ్లలో రూ.850.63 కోట్లు అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఈ పథకం పేరును తల్లికి వందనంగా మార్చింది. అదే సమయంలో ఈ పథకం అమలులో అనేక ఆంక్షలు పెట్టారు. దీంతో పలువురు ఈ పథకానికి దూరమయ్యారని తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఇవీ నిబంధనలు

● తల్లికి వందనం పథకానికి అర్హత పొందడానికి లబ్ధిదారులు దారిద్య్ర రేఖకు దిగువన ఉండాలి.

● తల్లి, తండ్రి, పిల్లల ఆధార్‌ నంబర్లు చెల్లుబాటై ఉండాలి.

● నెలవారీ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు లోపు ఉండాలి.

● మూడెకరాల లోపు మాగాణి, 10 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారు మాత్రమే అర్హులు.

● మున్సిపల్‌ పట్టణాల్లో 1,000 చదరపు అడుగులకు మించి స్థలం ఉండరాదు.

● కుటుంబ సభ్యులకు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు.

● నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్‌ వినియోగించరాదు.

● ఆదాయ పన్ను చెల్లించే కుటుంబ సభ్యులు అనర్హులు.

● ట్రిపుల్‌ ఐటీ, పాలిటెక్నిక్‌ విద్యార్థుల తల్లులు ఈ పథకానికి అనర్హులు.

● వచ్చే విద్యా సంవత్సరంలో మాత్రం 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉంటేనే ఈ పథకం వర్తింపజేస్తారు.

వీరికి తరువాత..

అంగన్‌వాడీ నుంచి కొత్తగా ఒకటో తరగతికి వెళ్లే పిల్లలు, పదో తరగతి పూర్తి చేసుకుని, కొత్తగా ఇంటర్లో చేరే విద్యార్థుల పేర్లు ప్రస్తుతం అర్హుల జాబితాలో కనబడవు. ఈ నెల 21 నుంచి 26 వరకూ వీరి నమోదు ప్రక్రియ జరుగుతుంది. ఈ నెల 30న వెలువడే తుది జాబితాలో వీరి పేర్లు వస్తాయి. వీరికి వచ్చే నెల 5 తర్వాత తల్లికి వందనం డబ్బులు జమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఇంటర్‌ సెకండియర్‌ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం వర్తించదని, వీరు విద్యా దీవెన పథకం కిందకి వస్తారని చెబుతున్నారు.

నాడు తప్పు.. నేడు ఒప్పా?

గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మ ఒడి నిధుల నుంచి తొలుత రూ.1,000, తదుపరి ఏడాది నుంచి రూ.2 వేల చొప్పున పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు కేటాయించారు. ప్రతి జిల్లాలో ఒక ఖాతా ప్రారంభించి, దానికి ఈ నిధులు డిపాజిట్‌ చేయించారు. ఆ సొమ్ముతో పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణకు అవసరమైన కెమికల్స్‌, ఇతర సామగ్రి కొనుగోలు చేసేవారు. ఆయాలను నియమించి, వారికి నెలకు రూ.6 వేల గౌరవ వేతనం అందించారు. దీనిపై ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ అప్పట్లో తీవ్ర విమర్శలు చేశారు. వాటిని మరచిపోయారో ఏమో కానీ.. తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికీ రూ.15 వేలు ఇస్తామని ఎన్నికల సమయంలో గొప్పగా చెప్పగా.. తీరా అమలులోకి వచ్చేసరికి రూ.13 వేలు మాత్రమే ఇచ్చి, మిగిలిన రూ.2 వేలకు పాఠశాల నిర్వహణ పేరుతో కోత పెట్టారు. దీంతో, నాడు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో తప్పని చెప్పారని, ఇప్పుడు అదే విధానం ఎలా ఒప్పు అయిందని సోషల్‌ మీడియాలో పలువురు విమర్శిస్తున్నారు.

నిబంధనలు సరళతరం చేయాలి

ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ పథకాన్ని అమలు చేయాలి. ఇన్ని నిబంధనలు విధిస్తే అధిక సంఖ్యలో అనర్హులవుతారు. పదో తరగతి పూర్తి చేసిన వారికి కూడా ఈ పథకం వర్తింపజేయాలి. నెలకు 300 యూనిట్ల విద్యుత్‌ వాడకం నిబంధన తొలగించాలి.

– బి.సిద్దు, రాష్ట్ర సహాయ కార్యదర్శి, పీడీఎస్‌యూ

తల్లికి వంచన 1
1/2

తల్లికి వంచన

తల్లికి వంచన 2
2/2

తల్లికి వంచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement