
శనైశ్చరునికి ప్రత్యేక పూజలు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారి ప్రాతఃకాల అర్చనానంతరం భక్తులు ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు నిర్వహించారు. సర్వ దర్శనాలు చేసుకున్నారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యాన సిబ్బంది భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. టికెట్లు, వివిధ సేవల ద్వారా దేవస్థానానికి రూ.1,65,420 వచ్చింది. అన్నప్రసాద పథకానికి భక్తులు రూ.39,691 విరాళాలు సమర్పించారు.
‘కూటమి’ ఏడాది వైఫల్యాలపై
నేడు పుస్తకావిష్కరణ
అమలాపురం టౌన్: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం ముద్రించిన పుస్తకాన్ని పార్టీ నేతలు అమలాపురంలో ఆదివారం ఆవిష్కరించనున్నారు. స్థానిక హైస్కూల్ సెంటర్లోని ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు క్యాంపు కార్యాలయంలో ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్ పినిపే విశ్వరూప్, పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయిల్తో పాటు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు పాల్గొంటారు. ఆదివారం ఉదయం జిల్లా స్థాయిలోనూ, సోమవారం జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోను, మంగళవారం మండల కేంద్రాల్లోను ఈ పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతాయని జగ్గిరెడ్డి తెలిపారు.