Rajasthan: ఐదుగురు కూతుళ్లతో సహా తల్లి బావిలోకి దూకి..!

Rajasthan 40 Year Old Woman Jumped Into Well With Five Minor Daughters - Sakshi

జైపూర్‌: భర్తతో నిరంతర తగాదాలతో మనస్తాపం చెందిన ఓ ఇల్లాలు ఐదుగురి కూతుళ్లతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం స్థానికంగా కలకలం రేపుతోంది. శనివారం రాత్రి చోటుచేసుకున్న ఘటనలో ఆరుగురూ మృతి చెందారు. ఆదివారం ఉదయం గ్రామస్థులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాలను వెలికితీసి స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా మృతురాలిని శివలాల్‌ బన్‌జారా భార్యగా గుర్తించారు. బాదందేవి (40) ఏడుగురు పిల్లల తల్లి. ఘటనలో బాదందేవితోపాటు సావిత్రి (14), అంకాలీ (8), కాజల్‌ (6), గుంజన్‌ (4), అర్చన (ఏడాది వయసు) మృతి చెందగా, మిగతా ఇద్దరు కూతుళ్లు గాయత్రి (15), పూనమ్‌ (7) నిద్రపోవడంవల్ల తప్పించుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

దుప్పట్లను విక్రయించే పని చేసే శివలాల్‌కు, భర్య బాదందేవికి తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. ఐతే సంఘటన సమయంలో శివలాల్‌ ఇంటివద్దలేనని, బంధువు మృతి చెందితే సంతాపం తెల్పడానికి శనివారం రాత్రి పొరుగూరికి వెళ్లినట్లు తెలిపాడు. సంఘటన గురించి తెలియడంతో ఆదివారం ఉదయం తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఐతే భార్య ఎందుకు చనిపోవాలనుకుందో మాత్రం పోలీసులకు తెల్పలేదు. మృతుల ఇంటికి కేవలం వంద మీటర్ల దూరంలోనే బావి ఉంది. మృతదేహాల పోస్టుమార్టం రిపోర్టు రావల్సి ఉంది. ఈ సంఘటనపై సీఆర్పీసీ సెక్షన్‌ 174 కింద కేసు నమోదు చేసి, విచారణ చేపడుతున్నామని ఎస్‌హెచ్‌ఓ రాజేంద్ర మీనా మీడియాకు తెలిపారు.

చదవండి: మహిళ ఎకౌంట్లో పొరపాటున రూ. 7.7 కోట్లు జమ.. దొంగతనం కేసు!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top