ఇద్దరికీ పాజిటివ్‌: పేషెంట్‌కు వేధింపులు

FIR Registered On Doctor Over Molestation On Covid Patient Noida - Sakshi

న్యూఢిల్లీ: కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న యువతిపై ఓ డాక్టర్‌ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఐసోలేషన్‌ వార్డులో ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ దారుణ ఘటన నోయిడాలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో సోమవారం చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వివరాలు..  ఇరవై ఏళ్ల యువతికి ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆమె నోయిడాలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో కోవిడ్‌ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న డాక్టర్‌కు సైతం మహమ్మారి సోకగా... బాధితురాలితో కలిపి అతడిని ఒకే ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు.(క్వారంటైన్‌ సెంటర్‌లో దారుణం)

ఈ నేపథ్యంలో సదరు డాక్టర్‌ సోమవారం తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం గురించి అడిషనల్‌ డీసీపీ మాట్లాడుతూ.. ఈ ఘటనకు ఆస్పత్రి యాజమాన్య వ్యవహార శైలి కూడా కారణమని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇద్దరు కోవిడ్‌ పేషెంట్లను ఒకే వార్డులో ఉంచి సేవలు అందించినందుకు చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. బాధితురాలి ఫిర్యాదుకు తాము సత్వరమే స్పందించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుడు ప్రస్తుతం ఆస్పత్రిలోనే ఉన్నాడని, కోవిడ్‌ నిబంధనల ప్రకారం అతడి వాంగ్మూలం నమోదు చేస్తామని పేర్కొన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top