కల్తీ బొగ్గు దందా గుట్టురట్టు | Eight Members Arrested By Police For Supply Of Adulterated Coal | Sakshi
Sakshi News home page

కల్తీ బొగ్గు దందా గుట్టురట్టు

Aug 1 2020 5:00 AM | Updated on Aug 1 2020 5:00 AM

Eight Members Arrested By Police For Supply Of Adulterated Coal - Sakshi

పట్టుబడిన కల్తీ బొగ్గు దందా నిందితులు

సాక్షి, నేరేడ్‌మెట్‌ (హైదరాబాద్‌): పెద్ద పరిశ్రమలు కొనుగోలు చేసిన నాణ్యమైన బొగ్గును దారి మళ్లించి కాజేసి... సగం లోడు నాసిరకం బొగ్గును నింపుతూ మోసం చేస్తున్న కల్తీ మాఫియా గుట్టును ఎల్‌బీనగర్‌ జోన్‌ ఎస్‌ఓటీ, ఇబ్రహీంపట్నం పోలీసులు రట్టు చేశారు. లారీ యజమానులు, డ్రైవర్లతో కుమ్మక్కై బడా పరిశ్రమలను బురిడీ కొట్టిస్తూ కల్తీ బొగ్గు దందా చేస్తున్న 8మంది నిందితులను అరెస్టు చేశారు. 1.050 టన్నుల నాణ్యమైన బొగ్గుతోపాటు 700 టన్నుల నాసిరకం బొగ్గు, రెండు లారీలు, జేసీబీలు, రూ.2.50 లక్షల నగదుతో కలిపి మొత్తం రూ.1.62 కోట్ల విలువైన సొత్తును పోలీసులు సీజ్‌ చేశారు.

శుక్రవారం నేరేడ్‌మెట్‌లోని రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మహేష్‌భగవత్‌ వివరాలు వెల్లడించారు. హస్తినాపురానికి చెందిన గుండె రాజు 2014 నుంచి ఇబ్రహీంపట్నం మండలం రాందాస్‌పల్లిలో బొగ్గు డంపింగ్‌ యార్డును ఏర్పాటు చేసుకొని బొగ్గు సరఫరా వ్యాపా రం ప్రారంభించాడు. ఈ యార్డు పక్కనే గగన్‌పహాడ్‌కు చెందిన అమీర్‌ మహ్మద్‌ డంపింగ్‌ యార్డు కూడా ఉంది. వీరిద్దరూ కొత్తగూడెం, సింగరేణి నుంచి తక్కువ నాణ్యత ఉన్న బొగ్గు, బొగ్గు బూడిదను కొనుగోలు చేసి తమ డంపింగ్‌ యార్డులకు తరలిస్తారు. అనంతరం అదే బొగ్గును స్థాని క చిన్నతరహా పరిశ్రమలకు విక్రయిస్తూ తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. 

ప్రణాళిక ఇలా... 
విద్యుత్‌ ప్లాంట్లు, సిమెంట్, కాగితం తయారీ, అల్యూమినియం ప్లాంట్లు, ఫార్మా కంపె నీలు, ఉక్కు పరిశ్రమలకు అధిక నాణ్యత కలిగిన బొగ్గు అవసరం. లారీ డ్రైవర్లకు డబ్బులు ఆశజూపి సింగరేణి కాలరీస్‌ నుంచి, విదేశీ బొగ్గుతో ఏపీలోని కృష్ణపట్నం పోర్టు నుంచి వచ్చే నాణ్యమైన బొగ్గు లారీ లను తమ డంపింగ్‌ యార్డులకు తీసు కొచ్చి... సగం లోడు ఖాళీ చేసి నాసిరకం బొగ్గును నింపి పరిశ్రమలకు పంపేవారు. బొగ్గు కల్తీ జరుగుతోందనే విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం పోలీసులు డంపింగ్‌ యార్డులపై దాడి చేసి, నిందితులు గుండె రాజు, కాట్రవత్‌ సోమ, చల్లా అమరేందర్‌రెడ్డి, కురతాల మల్లేష్, నిజాముద్దీన్, ఎరుకల అంజయ్య, సగరాల సత్యం, రిజ్వాన్‌లను అరెస్టు చేశారు. మరో ముగ్గురు నిందితులు ఉత్తంపల్లి లక్ష్మణ్, అమీర్‌ మహ్మద్, ఉమాకొండ పురుషోత్తంరెడ్డిలు పరారీలో ఉన్నారని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement