వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే కాణిపాక ఆలయ అభివృద్ధి ఆలయ జీర్ణోద్ధరణతోపాటు భక్తుల వసతికి ప్రాధాన్యం అదనపు వసతి గదుల నిర్మాణానికి శ్రీకారం రెండేళ్ల క్రితమే భవన నిర్మాణం పూర్తి అప్పటి మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నేడు మళ్లీ ప్రారంభోత్సవానికి సిద్ధమైన నేతలు
కాణిపాకం: అధికారం మాదే.. ఏంచేసినా చెల్లిపోతుందిలే అని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ నిజం అనేది నిప్పులాంటిదని గ్రహించలేకపోతున్నారు. ఎలాంటి అభివృద్ధీ చేయనే గత ప్రభుత్వంలో చేసి నిలిచిపోయిన అరకొర పనులు పూర్తి చేసి ఆ క్రెడిట్ తమదేనని జబ్బలు చరుచుకోవడం రివాజుగా మారుతోంది. ఇప్పుడు సత్య ప్రమాణాలకు నిలయమైన కాణిపాకాలయంలోనూ అదేతంతు జరుగుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టి.. పూర్తి చేసి.. ప్రారంభోత్సవం చేసిన వసతి సముదాయాన్ని నేడు మళ్లీ ప్రారంభోత్సవం చేసేందుకు ముహూర్తం ఖరారు చేయడంపై జనం నవ్వుకుంటున్నారు. అన్నీ ఆ దేవుడు చూస్తున్నాడు.. అంటూ చర్చించుకుంటున్నారు.
204 గదుల దిశగా అడుగులు
దాదాపు 12 ఏళ్ల క్రితం కాణిపాకంలో భక్తుల కోసం నిర్మించిన వినాయక సదన్న్లో 100 గదులు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో సూట్ రూములు, ఏసీ, నాన్న్ఏసీ గదులున్నాయి. కానీ కాలక్రమేణా భక్తుల రద్దీ పెరగడంతో ఈ గదులు సరిపోకపోక ఇబ్బందులు తలెత్తేవి. ప్రస్తుతం రోజుకు 30 వేల మందికి పైగా భక్తులు ఆలయానికి వస్తుండగా, వారిలో చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి చేరుకుంటున్నారు. దర్శనం పూర్తయ్యే వరకు విశ్రాంతి కోసం వసతి అవసరమవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు వసతి సముదాయాన్ని ఆధునికీకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 2021లో రూ.25 లక్షలతో పాత గదులకు మరమ్మతులు చేపట్టారు.
రెండేళ్లుగా ఫర్నిచర్ పేరుతో కాలయాపన
భవన నిర్మాణం రెండేళ్ల క్రితమే పూర్తయింది. అప్పటి మంత్రుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా పూర్తయ్యింది. అయితే అనంతరం ఫర్నిచర్, అంతర్గత ఏర్పాట్ల పేరుతో గదులను పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోకి తీసుకురాలేదు. కోట్ల రూపాయలతో నిర్మించిన వసతి సముదాయం ఖాళీగానే ఉండిపోయింది. ఇప్పుడు మళ్లీ గురువారం ప్రారంభోత్సవానికి ముహూర్తం నిర్ణయించడంతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
మళ్లీ రూ.13 కోట్లతో
అదనపు గదుల నిర్మాణం
భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్సీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రెండు బ్లాక్లపై మరో రెండు అంతస్తులు నిర్మిస్తూ అదనంగా 104 గదుల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. రూ.13 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 88 సాధారణ గదులు, 14 సూట్ రూములు అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు.


