వెదురుకుప్పం: ఒక దీపం ఇంటికి వెలుగునిస్తే చదువుల దీపం పేదరికాన్ని దూరం చేస్తుందని భావించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలిపారు. వెదురుకుప్పంలో డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిపై ఆయన మండిపడ్డారు. డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కోసం అప్పట్లోనే పచ్చికాపల్లం సబ్ స్టేషన్ సమీపంలో సుమారు 11 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించినట్లు గుర్తుచేశారు. ఆ తరువాత భవన నిర్మాణాలకు రూ.17,82,50000 నిధులు మంజూరైందన్నారు. రెండు సార్లు టెండర్లకు పిలవగా అప్పటికే ఎన్నికల కోడ్ రావడంతో ఈ పనులు అర్ధంతరంగానే ఆగిపోయాయన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రెండేళ్లుగా డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. వైఎస్సార్సీపీపై కక్ష పెట్టుకుని పేద పిల్లలపై పగ తీర్చుకుంటున్నట్లు చెప్పారు. చవటగుంట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాత్కాలికంగా డిగ్రీ తరగుతులు నడుస్తున్నా తామేదో చేసినట్లు కూటమి ప్రభుత్వ నాయకులు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉంటే పాలిటెక్నిక్ కళాశాల కూడా మంజూరయ్యేదన్నారు.
కలవకుంట జలాశయం అభివృద్ధి ఏదీ?
పెనుమూరు మండలంలో ఉన్న కలవకుంట జలాశయ అభివృద్ధికి నిధులు కావాలని మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి, తాను అడిగిన వెంటనే అప్పటి సీఎం వైఎస్ జగన్ రూ.190 కోట్లు మంజూరు చేసినట్లు నారాయణస్వామి తెలిపారు. కూటమి ప్రభుత్వంలో పనులు ముందుకు సాగకపోగా మంజూరైన నిధులు ఏమయ్యాయో తెలియడంలేదన్నారు.


