తిరుమల : వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం తిరుమల భక్త జనసంద్రంగా మారింది. వేసవి సెలవులు, పరీక్షల ముగింపు, ఫలితాల వెల్లడి నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. రెండు రోజుల్లో 1.63 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 86 వేల మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. వీరిలో 70 వేల మంది భక్తులు కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. అదే సమయంలో హుండీ ద్వారా రూ.8 కోట్లకు పైగా కానుకలు సమర్పించినట్లు అధికారులు వెల్లడించారు. సర్వదర్శనం టోకెన్ల కోసం అలిపిరి ప్రాంతంలో తెల్లవారుజాము నుంచే భారీ క్యూలు కనిపిస్తున్నాయి.
సర్వదర్శనానికి 24 గంటలు
భక్తుల రద్దీ కారణంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూ ఆక్టోపస్ భవనం వరకు కొనసాగుతున్నాయి. దీంతో సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.


